Begin typing your search above and press return to search.

శ్రీశైలం వీధుల్లో రచ్చ రచ్చ చేసిన కన్నడిగులు

By:  Tupaki Desk   |   31 March 2022 5:40 AM GMT
శ్రీశైలం వీధుల్లో రచ్చ రచ్చ చేసిన కన్నడిగులు
X
చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అసాధారణ పరిస్థితులకు కారణమైంది. ఒక టీ షాపు వద్ద మొదలైన గొడవ అది కాస్తా అంతకంతకూ పెరిగిపోయింది. బుధవారం అర్థరాత్రి వేళ చోటు చేసుకున్న ఈ ఉదంతంతో రెచ్చిపోయిన కన్నడ భక్తులు శ్రీశైలంలో వీరంగం చేశారు.. విద్వంసానికి పాల్పడ్డారు. ఒక టీ షాపు వద్ద స్థానికులకు.. కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో కన్నడ భక్తుడికి గాయాలయ్యాయి.

దీంతో రెచ్చిపోయిన కన్నడ భక్తుల సమూహం.. సదరు టీషాపుకు నిప్పు పెట్టటంతో పాటు పలు దుకాణాలపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. వీధుల్లోని భక్తుల మీదా కన్నడ భక్తులు దాడులకు దిగటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీసుల స్పందించి.. రంగంలోకి దిగటంతో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. వాతావరణం మాత్రం ఉద్రిక్తంగా మారిందని చెబుతున్నారు.

గాయపడ్డ కన్నడ భక్తుడ్ని జగద్గురు పీఠాధిపతి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం సున్నిపెంటకు తరలించారు. ఉగాది సందర్భంగా శ్రీశైల మల్లిఖార్జున స్వామిని కన్నడిగులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. స్వామి దర్శనం కోసం భారీగా భక్తులు వస్తుంటారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా.. భక్తుల రాక తక్కువగా ఉంది. ఈసారి వైరస్ ప్రభావం లేకపోవటంతోగడిచిన కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రానికి వస్తున్నారు.

అయితే.. భక్తుల రూపంలో వస్తున్న వారిలో చాలామంది మద్యం సేవించి.. స్వామి దర్శనానికి వెళ్లే ప్రయత్నం చేయటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల తీరును తప్పు పడుతున్నారు. మద్యం సేవించి స్వామి దర్శనానికి వెళుతున్న వైనంపై ఆలయ అధికారులు.. సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయటం.. దాన్ని వారు పట్టించుకోకపోవటం జరుగుతోంది. దీంతో.. మిగిలిన భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే స్థానికంగా గొడవ జరగటం.. కన్నడిగులు రెచ్చిపోవటం.. పెద్ద ఎత్తున దాడులకు దిగటం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.