Begin typing your search above and press return to search.

రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్స్ రద్దు.. షాకిచ్చిన సర్కార్

By:  Tupaki Desk   |   5 April 2022 10:30 AM GMT
రాడిసన్ హోటల్ లో బార్, పబ్ లైసెన్స్ రద్దు.. షాకిచ్చిన సర్కార్
X
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై ఎక్సైజ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. రాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న పబ్ లైసెన్స్ ను రద్దు చేసింది. హోటల్ కు సంబంధించి లిక్కర్ లైసెన్స్ ను కూడా రద్దు చేసింది.

రాడిసన్ హోటల్ లో 24 గంటలు లిక్కర్ సప్లై చేయడం కోసం అనుమతి తీసుకున్నారు. దీనికోసం 56 లక్షల రూపాయల టాక్స్ కూడా చెల్లించారు. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లో పబ్ తోపాటు 24 గంటల 2బీ బార్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కొరఢా ఝలిపించింది. నిబంధనలు ఉల్లంగించి పబ్ లు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించింది.

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో డ్రగ్స్ లభించిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాసగౌడ్ ఆదేశాల మేరకు పబ్ మరియు బార్ లైసెన్స్ లను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో గంజాయి , డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి తెలిపారు. పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా యజమానులు బాధ్యత వహించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లైసెన్స్ లు రద్దు చేస్తామని గతంలోనే హెచ్చరించినట్లు తెలిపారు.

యజమానులు ఎంతటి వారైనా సరే నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించమని ఎక్సైజ్ మంత్రి తేల్చిచెప్పారు. ఇదే సమయంలో అధికారులు సైతం పబ్ లు, బార్ లపై నిరంతరం దాడులు కొనసాగించాలని ఆదేశించారు. ఉదాసీనంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.

ఇక డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపైన కూడా నిఘా పెట్టామని పేర్కొన్నారు. రాడిసన్ హోటల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు.

ఇక రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవమారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు రిపోర్ట్ కోసం పంపించారు. ఇక ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అనిల్, అభిషేక్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక ఈవెంట్ మేనేజర్ కునాల్, డీజే శశిధర్ రావుల పాత్రపై కూడా అనుమానాలున్నట్లు పోలీసుల తెలిపారు. పబ్ నిర్వాహకుల్లో మరో ఇద్దరు అర్జున్ వీరమాచినేని, కిరణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నారు.