Begin typing your search above and press return to search.

ఏళ్ల క్రితం తప్పిపోయి వాట్సాప్ మెసేజ్ తో దొరికాడు.. ఎలాగో తెలుసా?

By:  Tupaki Desk   |   31 March 2022 11:30 PM GMT
ఏళ్ల క్రితం తప్పిపోయి వాట్సాప్ మెసేజ్ తో దొరికాడు.. ఎలాగో తెలుసా?
X
చిన్నప్పుడు తిరునాళ్లలో తప్పిపోవడం... పెద్దయ్యాక దొరకడం వంటివి మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో అలాంటివి జరగడం చాలా అరుదు. కానీ అలాంటి సంఘటనే జరిగింది నెల్లూరు జిల్లాలో. 19 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన తండ్రిని... వాట్సాప్ మెసేజ్ లో వచ్చిన ఓ చిన్న మెసేజ్ ఆధారంగా చేరుకున్నాడు ఓ వ్యక్తి. ఇదంతా వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే అసలు ఇదెలా సాధ్యం అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం గమళ్ల పాలెంకు చెందిన బండ్ల సురేష్... తన కుటుంబంతో కలిసి అక్కడే నివసించే వాడు. అయితే సురేష్ కు 2004లో పెళ్లి అయింది. అయితే ఆ సమయంలోనే తన తండ్రి కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి సురేష్ తన తండ్రి కోసం వెతకని చోటు లేదు. కొన్నేళ్ల పాటు తన తండ్రి జాడ కోసం విపరీతంగా ప్రయత్నించాడు. చివరకు పోలీస్ కంప్లెంట్ కూడా ఇచ్చాడు. కానీ లాభం లేకపోయింది. ఇక ఆశలు వదులుకున్న ఆయన... తన కుటుంబానికి తానే పెద్దగా మారి జీవనం సాగిస్తున్నాడు.

అప్పుడప్పుడు తన తండ్రి, ఆయన తనపై చూపించే ప్రేమ గుర్తు వచ్చినా చేసేదేం లేక నాలుగు కన్నీటి బొట్లు రాల్చేవాడు. తన తండ్రి బతికి ఉంటే తమ దగ్గరకు చేర్చమని ఆ దేవుడిని ప్రార్థించేవాడు. అలా దాదాపు 19 ఏళ్లు గడిచింది. ఈ క్రమంలోనే ఆయన వాట్సాప్ లోని ఓ గ్రూపుకు ఒక సందేశం వచ్చింది. అది చూసిన సురేష్ చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఎలాగోలా కష్టపడి తన తండ్రిని జాడ గురించి తెలుసుకున్నాడు.

ఆ మెసేజ్ లో వచ్చిన ఫొటోలో తన తండ్రి కనిపించడంతో పాటు ఆ మెసేజ్ ఎక్కడి నుంచి ఆ గ్రూపుకి వచ్చిందని చాలా ప్రయత్నాలు చేశాడు. అలా తన తండ్రి కేరళ రాష్ట్రం కొట్టాయంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే అక్కడకు వెళ్లి... నవ జీవన్ ట్రస్ట్ సంరక్షణలో ఉన్న తన తండ్రిని కలుసుకున్నాడు. తన తండ్రిని హత్తుకొని కంటతడి పెట్టుకున్నాడు. ట్రస్ట్ వాళ్లకు తన తండ్రి ఐడీ కార్డులు చూపించి వారి అనుమతితో... తండ్రి అంగీకారంతో ఆయని తిరిగి నెల్లూరు జిల్లాలోని తమ ఇంటికి తీసుకొచ్చాడు.

దాదాపు 19 ఏళ్ల తర్వాత సరేష్ తండ్రి బండ్ల సుబ్బారావు తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇన్నాళ్లూ ఏమైపోయాడో తెలియని ఆయన ఇంటికి చేరే సరికి కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే గత ఆరు నెలల క్రితమే సుబ్బారావు నవ జీవన్ ట్రస్ట్ కి చేరుకున్నట్లు ఆ సంస్థ సభ్యులు చెబుతున్నారు. అయితే 19 క్రితం తప్పిపోయిన ఆయన ఇన్నాళ్లు ఎక్కుడున్నాడో మాత్రం ఇప్పడికీ ఎవరికీ తెలియట్లేదు. సురేష్ తండ్రి సుబ్బారావు కూడా ఇన్నాళ్లూ ఎక్కడ ఉన్నారు అంటే చెప్పలేక పోతున్నాడు. ఎక్కడుంటే ఏంటి ఇప్పుడు మాత్రం తానెంతగానో ప్రేమించే తన తండ్రి తనతోనే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని సురేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.