Begin typing your search above and press return to search.

న్యూయార్క్ టైమ్స్ నిజంగానే బాబును పొగిడిందా?

By:  Tupaki Desk   |   29 Jun 2018 12:55 PM GMT
న్యూయార్క్ టైమ్స్ నిజంగానే బాబును పొగిడిందా?
X
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ పై న్యూయార్క్ టైమ్స్‌ లో కథనం వచ్చిందంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో హోరెత్తుతోంది. నిజమే... న్యూయార్క్ టైమ్స్‌ లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌ పై కథనం రావడం నిజమే.. అందులో ఏపీ ప్రభుత్వం చర్యలను ప్రస్తావించడమూ వాస్తవమే. కానీ.. ఏపీలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఎంత వాస్తవమన్నదే ప్రశ్న. ప్రకృతికి మేలు చేసే వ్యవసాయం గురించి మాట్లాడాలంటే దేశంలో ఏ రాష్ట్రం గురించి మాట్లాడాలి...? సిక్కిం గురించి మాట్లాడుకోవాలి. పూర్తిగా సేంద్రియ వ్యవసాయమే జరుగుతున్న రాష్ర్టం సిక్కిం. అక్కడ ఎరువుల వాడకం లేదు...పురుగుల మందులు వాడకం లేదు.. అలాంటి రసాయనాల కోసం వేలకు వేలు ఖర్చు లేదు. అతి తక్కువ ఖర్చుతో సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించడమే అక్కడి విధానం.

రసాయన రహిత వ్యవసాయానికి ఏపీ తీసుకుంటున్న చర్యలను న్యూయార్క్ టైమ్స్ కథనంలో ప్రస్తావించారు. వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ ప్రచురించిన కథనంలో ఈ మేరకు ఏపీ గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు200 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని.. ఇప్పటికే లక్ష మంది రైతులు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని రాసుకొచ్చింది.

అంతేకాదు.. ఏపీలో ఈ ఏడాది చివర కల్లా 5 లక్షల మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 60 లక్షల మంది రైతులు ఇదే తరహాలో వ్యవసాయం చేసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇటీవల రోమ్‌ లో జరిగిన ఓ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు దీనిపై చర్చించారు. ఏపీలోనూ ఈ నెలలోనే ఈ ప్రోగ్రాం లాంచ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుండడం వాస్తవమే అయినా ప్రస్తుతం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఏమీ ఏపీలో ఆ స్థాయిలో లేదని విశ్లేషకులు అంటున్నారు. అదే నిజమైతే ఇన్ని లక్షల టన్నుల రసాయన ఎరువులు - పురుగు మందులు రాష్ట్రంలో ఉండవని అంటున్నారు.