Begin typing your search above and press return to search.

కరోనా నుండి కోలుకుంటున్న న్యూయార్క్ ... తాజా మృతుల సంఖ్య '0' !

By:  Tupaki Desk   |   13 July 2020 5:33 PM GMT
కరోనా నుండి కోలుకుంటున్న న్యూయార్క్ ... తాజా మృతుల సంఖ్య 0 !
X
కరోనా వైరస్ ..జన్మనిచ్చిన చైనాను వదిలి పెట్టింది. కానీ , ప్రపంచ అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాను ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు కోటి 30 లక్షలు దాటితే ..అందులో ఒక్క అమెరికాలోనే 34 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అంటేనే కరోనా ప్రభావం అమెరికా పై ఎలా ఉందొ ఊహించుకోవచ్చు. ఇప్పటికి కూడా అమెరికాలో కేసులు ప్రతి రోజు సరాసరిగా 60 వేలకి పైగా నమోదు అవుతున్నాయి.

ఇకపోతే , అమెరికాలో ఎక్కువగా కేసులు నమోదు అయ్యి , కరోనాను కేరాఫ్ గా మారింది న్యూయార్క్ సిటీ. అమెరికాలో నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఈ న్యూయార్క్ సిటీలోనే 40 శాతానికి పైగా కేసులు వెలుగుచూశాయి. అలాగే భారీ సంఖ్యలో భాదితులు మృతిచెందారు. ఒకానొక సమయంలో న్యూయార్క్ కరోనా మృతుల మృతదేహాలతో నిండిపోయింది. తాజాగా ఆ కఠిన పరిస్థితుల నుండి న్యూయార్క్ సిటీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. నాలుగు నెలల తర్వాత న్యూయార్క్ లో ఆదివారం కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ విషయాన్ని న్యూయార్క్ నగర డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మార్చి 11న న్యూయార్క్ లో కరోనా తొలి మరణం సంభవించింది. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఇక ఏప్రిల్ 7 నాటికి కరోనాతో 597 మంది చనిపోగా, ఎలాంటి లక్షణాలు లేకుండా 216 మంది ప్రాణాలు విడిచారు. అలాగే ఏప్రిల్ 9న అత్యధికంగా 799 మంది చనిపోయారు. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి రేటు 1.3 శాతంగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పుడిప్పుడే మళ్లి మునుపటి రోజులు వస్తున్నాయి. అమెరికా మొత్తం మీద కరోనా వైరస్ వల్ల 1,34,904 మంది చనిపోయారు.