Begin typing your search above and press return to search.

మరో వైరస్: చైనాలో పందుల నుంచి మనుషులకు వ్యాప్తి

By:  Tupaki Desk   |   1 July 2020 11:30 PM GMT
మరో వైరస్: చైనాలో పందుల నుంచి మనుషులకు వ్యాప్తి
X
కరోనా వైరస్ అంటించి లక్షలమంది మరణాలకు కారణమైన చైనా దేశం తాజాగా మరో కొత్త వైరస్ ను పుట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే మరోకొత్త రకం వైరస్ చైనాలోనే పందుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ వైరస్ కు జీ4గా చైనా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. వైరస్ చైనాలో పందుల కబేళాలలో పనిచేస్తున్న వారికి సోకిందని సోమవారం వెల్లడించిన నివేదికలో తెలిపారు. 2016-18వరకు పందులను పెంచే 10శాతం మందికి సోకింది. తాజాగా చైనా సాధారణ జనాభాలో 4.4శాతం మందికి జీ4 వైరస్ సోకినట్టు తేలింది. పరీక్షలు నిర్వహించి వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఉంచి చికిత్స చేస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి క్వారంటైన్ చేస్తున్నారు. ఈ కేసులు పందుల పెంపకం ఎక్కువగా ఉండే హీబే, షాండోంగ్ ప్రావిన్సుల్లో గుర్తించారు. తాజాగా ఆ ప్రాంతాల్లో 18-35 ఏళ్లలోని 20.5శాతం మందికి పాజిటివ్ గా తేలిందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.

చైనాలో మరో కొత్తరకం ఫ్లూ వైరస్ పందుల నుంచి మనుషులకు వ్యాపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోందని.. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని.. మహమ్మారిగా మారవచ్చని చైనా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తరకం వైరస్ కాబట్టి దీన్నుంచి కాపాడుకునే రోగ నిరోధక శక్తి ప్రజలకు తక్కువగా ఉంటుందని మరణాలు సంభవించే అవకాశాలుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం గుర్తించిన ఈ వైరస్ పందుల ద్వారా వ్యాపిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలున్న హెచ్1ఎన్1కు దగ్గరి పోలికలున్నాయి. 2011లోనే దీనిపై పరిశోధనలు చేశారు. 2016 తర్వాత ఇది మరింత బలంగా మారినట్లు తేలింది. కరోనా మాదిరే ఇది ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించారు.

ఈ వైరస్ పాతదేనని.. దీనికి వ్యాక్సిన్ మందులు లేవని చైనా శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచానికి మరో వైరస్ ముప్పును చైనా కలుగచేస్తోందని తెలుస్తోంది. ఈ వార్త అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.