Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కల్లోలం.. మొత్తం 87 కేసులు

By:  Tupaki Desk   |   1 April 2020 7:03 AM GMT
ఏపీలో కరోనా కల్లోలం.. మొత్తం 87 కేసులు
X
ఆంధ్రప్రదేశ్‌ లో రెండు పదులకు పరిమితమైన కరోనా కేసులు ఒక్కసారిగా నలభైకి పైగా చేరాయి. మార్చి 30వ తేదీ వరకు 23 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా ఆ మరుసటి రోజు మంగళ - బుధవారంతో 87కు చేరాయి. ఒక్కసారిగా 43 కేసులు వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశంలో కల్లోలం రేగింది. కేసులు అనూహ్యంగా పెరగడంతో ప్రజలతో పాటు ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇన్నాళ్లు రాష్ట్రంలో పరిస్థితి సజావుగా ఉందని భావించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అనూహ్యంగా కేసులు పెరగడంతో అప్రమత్తమయ్యారు.

రాష్ట్రంలో ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్‌ సోకిన వారి సంఖ్య 87. మొత్తం 373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన 330 కేసుల్లో నెగిటివ్‌ వచ్చింది. అయితే ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులే. అక్కడ వైరస్‌ సోకగా వారు ఆంధ్రప్రదేశ్‌ కు వచ్చిన 14 రోజులకు కరోనా వైరస్‌ బయటపడింది. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి.

ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు దేశవ్యాప్తంగా ఓ మతానికి చెందిన ప్రజలు హాజరయ్యారు. మార్చి 14 - 15వ తేదీల్లో జరిగిన ప్రార్థనలకు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆ మతానికి చెందిన ప్రజలు వెళ్లారు. ఆ దర్గాకు వెళ్లిన వారు తిరిగి రాష్ట్రంలోని తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే అక్కడే వారికి కరోనా సోకింది. ఆ విషయం సోకిన వారితో వారి కుటుంబసభ్యులు - సన్నిహితులకు తెలియలేదు. దీంతో యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడకు వెళ్లిన ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ బయటపడుతోంది.

మార్చి 17వ తేదీన రాష్ట్రానికి వచ్చిన వారు 14 రోజులు ముగియడంతో మార్చి 31వ తేదీన కరోనా వైరస్‌ బయటపడింది. ఆ కరోనా వైరస్‌ పాజిటివ్‌ తేలడంతో వారి కుటుంబసభ్యులతో పాటు వారి బంధుమిత్రులు షాక్‌ కు గురయ్యారు. దీంతో ప్రజలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇంకా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని ప్రభుత్వం అన్వేషిస్తోంది. వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎవరు? ఎక్కడ ఉన్నారో జల్లెడ పడుతున్నారు. దీంతోపాటు ఢిల్లీ నుంచి వచ్చే క్రమంలో వారు ప్రయాణించిన రైలు - బస్సు - ఆటో తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. వారితో పాటు ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఢిల్లీ ప్రయాణికులతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి మొదలైంది.

మార్చి 14 - 15 నుంచి 17వ తేదీ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని గుర్తిస్తున్నారు. దురంతో - ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వారు ఢిల్లీ నుంచి వచ్చిన వారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో 535 మంది ఉన్నారని వారిని గుర్తించి వారి నమూనాలు సేకరిస్తున్నారు.