Begin typing your search above and press return to search.

ఆ ఫైల్ కు ఏపీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:10 PM GMT
ఆ ఫైల్ కు ఏపీ గవర్నర్ గ్రీన్ సిగ్నల్
X
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ యూనివర్సిటీలకు కొత్త వైస్‌ చాన్సలర్ల (వీసీలు) నియామకం వ్యవహారం పెండింగ్ లో ఉంది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల చట్టానికి ఏపీ సర్కార్ సవరణ చేసిందని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ ఏసీ నారాయణ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో, వీసీల నియామకం వ్యవహారాన్ని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పెండింగ్ లో ఉంచారన్న టాక్ వచ్చింది. ఈ విషయంలో న్యాయ నిపుణులతో గవర్నర్ సంప్రదింపులు జరుపుతున్నారని, అందుకే నియామకం ఆలస్యమవుతుందోన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలోని 5 విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్‌చాన్సలర్లను నియమించేందుక గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ నియామకాలు జరుగుతాయని ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీ‌ష్‌ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలోని 5 ప్రముఖ విశ్వవిద్యాలయాలకు కొత్తగా వైస్ చాన్సెలర్లను నియమించారు. కొత్తగా నియమితులైన వీసీల్లో ఒకరు ఎస్సీ, మరొకరు బీసీకాగా, మిగిలిన ముగ్గురూ ఓసీలు కావడం విశేషం. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీకి సీనియర్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌), కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంకు ప్రొఫెసర్‌ తుమ్మల రామకృష్ణ (యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేశారు), అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీకు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రామకృష్ణారెడ్డిలను వీసీలుగా నియమించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డిని, కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంకు ప్రొఫెసర్‌ ఏ.ఆనందరావులను వీసీలుగా నియమించారు. అయితే, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ నియామకం వ్యవహారం ఇంకా పెండింగ్ లోనే ఉంది.