Begin typing your search above and press return to search.

అభాసు పాలు కావటం కాకుంటే.. ఈ మాటలేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:33 AM GMT
అభాసు పాలు కావటం కాకుంటే.. ఈ మాటలేంది కేసీఆర్?
X
దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామంటూ పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. హటాత్తుగా ఈ ఇష్యూ మీద యూటర్న్ తీసుకున్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని తామెప్పుడూ హామీ ఇవ్వలేదంటూ నిండు అసెంబ్లీలో కాన్ఫిడెంట్ గా చెప్పిన తీరుతో విపక్షాలే కాదు.. అధికార పార్టీకి చెందిన వారంతా నోట మాట రాని పరిస్థితి. అలా అని తమ భావాల్ని బయటకు చెబితే జరిగేదేమిటో తెలిసింది కాబట్టి.. గమ్మున ఉండిపోయారు.

‘‘దళితులకు 3 ఎకరాల భూమి వాగ్దానం మేము ఎప్పుడూ చేయలేదు. కొంత మంది ఇష్టానుసారంగా అనేస్తారు. నేను మాట్లాడిన మాటలు రికార్డులో ఉన్నాయి. గత ప్రభుత్వాలు అనుసరించిన భూ కేటాయింపుల విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు భూ కేటాయింపులు ఉం టాయి. కానీ గత ప్రభుత్వాలు ఒకరికి రెండు ఎకరాలు, ఒకరికి ఎకరం, మరికొందరికి అర ఎకరం ఇలా ఇష్టానుసారంగా కేటాయించింది. దళితులే కాదు ఏ సామాజిక వర్గానికి భూమి ఇవ్వాలన్నా కనీసం రెండున్నర నుంచి మూడు ఎకరాలు ఉండాలని అధ్యయనాల్లో తేలింది. అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడిన. ఒకవేళ దళిత కుటుంబం వద్ద ఎకరా భూమి ఉంటే రెండు ఎకరాలు కొనిస్తాం. రెండున్నర ఎకరాలు ఉంటే ఇంకో అర ఎకరం కొనిస్తామని హామీ ఇచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే అంశం ఉంది.’’ అని వ్యాఖ్యానించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు మూడు ఎకరాల భూమిని ఇవ్వటం సాధ్యం కాదన్న విషయాన్ని గ్రహించి.. తాజాగా ప్లేటు తిప్పేశారన్న మాట వినిపిస్తోంది. దళితులకు మూడు ఎకరాల భూమి కేటాయింపుపై తాను ఎప్పుడూ ఆ మాట అన్నది లేదంటూ చెప్పిన కేసీఆర్ మాటల్లో డొల్లతనాన్ని గుర్తు చేస్తూ గతంలో ఆయన ఎప్పుడు.. ఏ సందర్భంలో ఆయా వ్యాఖ్యలు చేశారన్న దాన్ని ఆధారాలతో సహా గుర్తు చేస్తున్నారు.

2014 టీఆర్ఎస్ మేనిఫేస్టోలో.. ‘‘భూమి లేని ప్రతి ఎస్సీ కుటుంబానికీ3 ఎకరాలు సాగుకు యోగ్యమైన భూ వసతి కల్పిస్తాం. సాగుకు కావాల్సిన నీరు, కరెంటు, విత్తనాలు.. మొదటి ఏడాదికి కావాల్సిన పెట్టుబడి తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వం అందిస్తుంది. కుటుంబంలోని మహిళ పేరుమీద పట్టా ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. అంత దాకా ఎందుకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది.. తొలి పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోట మీద సీఎం హోదాలో కేసీఆర్ చేసిన ప్రకనను చూస్తే.. ‘‘దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఈ గోల్కొండ కోట నుంచే మీ అందరి సమక్షంలో నేడు నేను శ్రీకారం చుట్టబోతున్నాను. ఈ పథకాన్ని ఇవ్వాల అన్ని జిల్లాల్లో మంత్రులు ప్రారంభించి దళిత సోదరులకు పాసుబుక్కులిస్తారు’’ అని ప్రకటించారు. అంతేకాదు..

2015 మార్చి 17న అసెంబ్లీలో మాట్లాడుతూ.. దళితలకు మూడు ఎకరాల భూమి కేటాయింపు హామీకి సంబంధించి మాట్లాడుతూ.. ‘‘అర, ఎకరం, ఎకరన్నర భూమి ఉన్న దళిత కుటుంబాలకు మిగతా మొత్తం మేము సమకూర్చి మూడు ఎకరాలు చేస్తాం. ఇప్పుడు ఆ ఫేజ్‌ ప్రారంభం అయింది’’ అని ప్రకటించారు. ఇన్ని ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా పుసుక్కున మాట మార్చేస్తే జరిగే డ్యామేజ్ భారీగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఆ విమర్శల్ని సీఎం కేసీఆర్ పట్టించుకుంటారా?