Begin typing your search above and press return to search.

ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం..!!

By:  Tupaki Desk   |   15 Nov 2020 9:10 AM GMT
ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం..!!
X
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు పెనుమార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతోందని తెలిసింది. నూతన సంవత్సరం కానుకగా జనవరిలో కొత్త జిల్లాలను జగన్ సర్కార్ తెరమీదకు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.

జిల్లాల ఏర్పాటుతో కొన్ని శాఖల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రత్యేకించి రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, పోలీస్ కమిషనరేట్లను పెంచడానికి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడల్లో మాత్రమే పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య ఏడు నుంచి 10 పోలీస్ కమిషనరేట్ లు ఏర్పాటు కానున్నాయని సమాచారం. పోలీసు యూనిట్ల సంఖ్యను 18 నుంచి 29కి పెంచే అవకాశం కనిపిస్తోంది.

కొత్త జిల్లాలతోపాటు పోలీస్ కమిషనరేట్లను పెంచాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఎస్పీ కార్యాలయాల స్థాయిని కమిషనర్ కార్యాలయంగా బదలాయిస్తారని సమాచారం.

ఏపీలో కొత్తగా కాకినాడ అర్బన్ - నెల్లూరు అర్బన్ - తిరుపతి అర్బన్ - రాజమండ్రి అర్బన్ - గుంటూరు అర్బన్ లను కమిషనరేట్ లుగా పెంచుతారని అంటున్నారు. దీంతో మొత్తం కమిషనరేట్ల సంఖ్య ఏడుకు పెరుగనుంది.

విశాఖపట్నం పోలీస్ యూనిట్ ను మూడుగా విభజించి అరకు - అనకాపల్లి పోలీస్ యూనిట్లు ఏర్పాటవుతాయని తెలుస్తోంది. తూర్పు గోదావరిలో రంపచోడవంరం - రాజమండ్రి - కాకినాడ - అమలాపురం కేంద్రాలుగా యూనిట్లు ఏర్పడొచ్చు అంటున్నారు.

పశ్చిమ గోదావరిలో ఏలురు, నరసాపురంలో యూనిట్లు ఏర్పాటు కావచ్చని అంటున్నారు. గుంటూరులో 3 - ప్రకాశంలో బాపట్ల - ఒంగోలు కేంద్రాల్లో కొత్త యూనిట్లు రావచ్చని సమాచారం. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మూడు చొప్పున, నెల్లూరు - కడప - కర్నూలు - అనంతపురం జిల్లాల్లో రెండుచొప్పున పోలీస్ యూనిట్లు ఏర్పాటు కావచ్చంటున్నారు.

కొత్త జిల్లాల నేపథ్యంలోనే పోలీస్ శాఖలో బదిలీలను డీజీపీ గౌతం సవాంగ్ నిషేధించారు. జిల్లాల ఏర్పాటు తర్వాతే బదిలీలు ఉండనున్నాయి.