Begin typing your search above and press return to search.

తెలంగాణ రూపు రేఖలు మారిపోతున్నాయ్

By:  Tupaki Desk   |   23 May 2016 9:28 AM GMT
తెలంగాణ రూపు రేఖలు మారిపోతున్నాయ్
X
అవును.. తెలంగాణ రూపు రేఖలన్నీ మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం చూసిన తెలంగాణ వేరు. ఇంకొన్ని నెలల్లో చూడబోయే తెలంగాణ వేరు. ఇప్పటిదాకా మనం కేవలం పది జిల్లాల తెలంగాణను మాత్రమే చూశాం. త్వరలోనే 24 జిల్లాలతో తెలంగాణ ఏర్పడబోతోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. అనేక తర్జనభర్జనలు.. సమీక్షల అనంతరం అధికార యంత్రాంగం 14 కొత్త జిల్లాలతో తుది జాబితాను ఖరారు చేసింది. దీంతో ఇప్పుడున్న పది జిల్లాలతో కలిపి మొత్తంగా 24 జిల్లాలతో తెలంగాణకు కొత్త రూపం రాబోతోంది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సరిహద్దులతో సహా కొత్త మ్యాప్ లను భూపరిపాలనా ప్రధాన కమిషనరేట్ సిద్ధం చేసింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి జిల్లాను.. నల్గొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలను కొమురం భీం జిల్లాగా.. వరంగల్‌ లోని భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని జిల్లాల విషయంలో ఎదురైన అభ్యంతరాల్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లాలోని జనగామకు బదులుగా మహబూబాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇంతకుముందు అనుకున్న జాబితాలో చేసిన కీలక మార్పు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా రానుంది. కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌ లో సిద్ధిపేటతోపాటు సంగారెడ్డిని కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో కామారెడ్డిని.. కరీంనగర్‌ లో జగిత్యాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఎంపిక చేశారు. మరోవైపు మహబూబ్‌ నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టేశారు. ఈ జిల్లాలో వనపర్తి - నాగర్‌ కర్నూల్‌ మాత్రమే కొత్త జిల్లాలు అవుతున్నాయి.

జంట నగరాలుగా పేరు పడిన హైదరాబాద్-సికింద్రాబాద్ ఇక వేర్వేరు జిల్లాలు అయిపోతున్నాయి. సికింద్రాబాద్ ను ప్రత్యేకంగా ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను తీసుకొస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ ను నాలుగు జిల్లాలుగా చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులుంటే చెప్పాలని ఉన్నతాధికారులు ఇప్పటికే కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు.