Begin typing your search above and press return to search.

అత్తింట్లో చోరీ చేసిన కొత్త కోడలు

By:  Tupaki Desk   |   29 Oct 2019 5:15 AM GMT
అత్తింట్లో చోరీ చేసిన కొత్త కోడలు
X
పెళ్లైయి నాలుగు నెలలు కూడా కాలేదు. భర్తతో గొడవలు. అత్తింటి మీద కోపంతో కొత్త కోడలు చేసిన నిర్వాకం నోరెళ్లబెట్టేలా చేసింది. షాకింగ్ గా మారిన ఈ వైనం గురించి అసలు నిజం తెలిసిన తర్వాత భర్త నోటి వెంట మాట రాని పరిస్థితి. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఓల్డ్ బోయినపల్లిలోని మల్లికార్జున కాలనీకి చెందిన 48 ఏళ్ల సరళ భర్తతో కలిసి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. వారికో కొడుకు. పేరు ధీరజ్. అతడికి కామారెడ్డికి చెందిన సుప్రియతో నాలుగు నెలల క్రితం పెళ్లి జరిగింది. అనంతరం అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే భర్తతో గొడవలు. అత్తారింట్లో ఉండని సుప్రియ పుట్టింట్లోనే ఉండేది.

అత్తింటి మీద ఉన్న కోపంతో భారీ పథకం వేసింది. కోడలు హోదాలో తన దగ్గరున్న ఇంటి తాళాలతో భారీ చోరీకి తెర తీసింది. తన ఇంటి వారితో కలిసి భారీ ప్లాన్ వేసింది. అత్తింట్లో ఎవరూ లేని వేళలో కారు తీసుకొని వెళ్లిన సుప్రియ.. ఇంట్లో ఉన్న రెండున్నర కిలోల బంగారం.. ఆరున్నర కేజీల వెండిని తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయింది.

షాపింగ్ కోసం బయటకు వెళ్లి వచ్చిన వారికి ఇంట్లో చోరీ జరిగిందన్న విషయం అర్థమై అవాక్కు అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు విచారణ షురూ చేశారు. సీసీ కెమేరా ఫుటేజ్ లను పరిశీలించగా.. కారులో వచ్చిన సుప్రియ.. ఆమె పేరెంట్స్ కలిసి ఇంట్లో చోరీ చేసిన వైనాన్ని గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లు వెల్లడించారు.

అత్తింట్లో తనకున్న గొడవల నేపథ్యంలో తానే చోరీకి పాల్పడినట్లుగా చెప్పారు. తాను దొంగలించిన ఆభరణాల్ని కామారెడ్డిలో దాచినట్లుగా ఆమె పేర్కొన్నారు. దీంతో సుప్రియను అదుపులోకి తీసుకున్నారు. అత్తింటికే కన్నమేసిన కొత్త కోడలు ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది