Begin typing your search above and press return to search.

ఈ రోజుతో వెయ్యి మార్కు దాటేస్తున్నామంతే!

By:  Tupaki Desk   |   29 March 2020 1:44 PM GMT
ఈ రోజుతో వెయ్యి మార్కు దాటేస్తున్నామంతే!
X
ఒకటి.. రెండు.. చాలా నెమ్మదిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే స్థానే.. గడిచిన వారం రోజులుగా చూస్తే.. పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. గడిచిన వారంలో.. కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరగటమే కాదు.. మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. ఇదంతా చూస్తున్నప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.

కరోనా వ్యాప్తిని మరింత తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే.. మనకందరికి సుపరిచితమైన క్రికెట్ తో పోల్చినప్పుడు.. గడిచిన వారం క్రితం వరకూ సాగింది కరోనా టెస్టు మ్యాచ్ మాత్రమే. సోమవారం నుంచి ఈ రోజు వరకూ (ఆదివారం) సాగింది వన్ డే మ్యాచ్. ఇప్పుడే అసలుసిసలు డేంజర్ మొదలైనట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. కీలకమైన.. అత్యంత కఠినమైన టీ20 మ్యాచులు సోమవారం నుంచి షురూ అవుతాయని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు (ఆదివారం) ఉదయం పది గంటల సమయానికి కరోనా పాజిటివ్ కేసులు 978కు చేరాయి. అంటే.. ఈ రోజు గడిచేసరికి ఎంత తక్కువగా వేసిన వెయ్యి దాటిపోవటం ఖాయం. ఇప్పడు వినిపిస్తున్న అంచనాల ప్రకారం ఈ సంఖ్య 1050కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.

ఇంతకాలం ఒకట్రెండు స్టేజ్ లో ఉన్న కరోనా మూడో స్టేజ్ లోకి అడుగు పెట్టినట్లే. ఏ దేశాన్ని అయినా అతలాకుతలం చేయటంలోనూ.. ఆ దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే కష్టకాలం.. కీలకమైన సమయం ఇదేనని చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది కరోనా టీ 20 మ్యాచ్ గా చెప్పాలి. ఎంతవేగంగా స్కోర్ బోర్డు మారుతుంటుందో.. పాజిటివ్ కేసులకు సంబంధించిన పరిస్థితులు మారిపోతాయని చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం కరోనా పాజిటివ్ కేసులు వెయ్యికి దగ్గరైతే.. పాతిక మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో దగ్గర దగ్గర 20 శాతం కేసులు మహారాష్ట్రకు చెందినవే కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. వెలుగు చూసిన మొత్తం కేసుల్లో దగ్గర దగ్గర పదిశాతం కేసులు నయమై.. కరోనా ముప్పు నుంచి బయటపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే.. ఇక ముందు జరిగేది మరో ఎత్తుగా చెప్పక తప్పదు.