Begin typing your search above and press return to search.

`నీట్` విద్యార్థుల‌కు కేంద్రం తీపి క‌బురు!

By:  Tupaki Desk   |   7 July 2018 9:48 AM GMT
`నీట్` విద్యార్థుల‌కు కేంద్రం తీపి క‌బురు!
X
ఏడాదికోసారి నిర్వ‌హించే నీట్ - జేఈఈ త‌ర‌హా ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌లో మంచి ర్యాంక్ సాధించేందుకు విద్యార్థులు అహోరాత్రులు శ్ర‌మిస్తుంటారు. అయితే, త‌మ త‌మ వ్య‌క్తిగ‌త‌ - అనారోగ్య కార‌ణాల వ‌ల్ల‌నో - నిమిషం ఆల‌స్యం నిబంధ‌న వ‌ల్ల‌నో కొంద‌రు విద్యార్థులు ఆ ప‌రీక్ష‌కు హాజ‌రుకాలేక నిరాశ చెందుతుంటారు. ఇక హాజ‌రైనప్ప‌టికీ కొంద‌రు క్వాలిఫై కాక దిగాలు ప‌డుతుంటారు. ఆ త‌ర‌హా విద్యార్థులంతా మ‌రోసారి ఆ ప‌రీక్ష‌లు రాసేందుకు ఏడాదిపాటు దిగాలుగా వేచి చూడాల్సిందే. ఐతే, ఇక‌పై ఆ అవ‌స‌రం లేకుండా కేంద్రం వారికి తీపి క‌బురు అందించింది. ఇకపై నీట్ - జేఈఈ (మెయిన్స్) - యూజీసీ నెట్ - సీమ్యాట్ ప్రవేశ పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహించబోతున్నట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే కీల‌క‌మైన ప్ర‌క‌ట‌నను ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్ ....మీడియాకు విడుద‌ల చేశారు.

అంతేకాదు, ప్ర‌స్తుతం ఈ పరీక్షలన్నింటినీ సీబీఎస్ ఈ నిర్వహిస్తోందని, ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించబోతోంద‌ని జ‌వ‌దేక‌ర్ తెలిపారు. ప్ర‌తి ఏడాది ఫిబ్రవరి - మే నెలల్లో నీట్ ప‌రీక్ష‌ను - జనవరి - ఏప్రిల్ నెల‌ల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించ‌నున్నామ‌ని చెప్పారు. నిర్ణీత నెల‌ల్లో 4 లేదా 5 వ తేదీల్లో ఆన్ లైన్ ద్వారా ఆ ప‌రీక్ష‌ల‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. అయితే, 2 సార్లు ప‌రీక్ష రాసిన త‌ర్వాత బెస్ట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆ ప్రవేశ పరీక్షలకు స‌న్న‌ద్ధమయ్యేందుకు అవ‌స‌ర‌మైన ప్రాక్టీస్ ను త‌మ ఇళ్లలో లేదా...అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లలో ఉచితంగా చేసుకోవచ్చని తెలిపారు. అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఆ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన సిలబస్ - ప్రశ్నల ఫార్మాట్ - భాష - ఫీజుల్లో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.