Begin typing your search above and press return to search.

కాబోయే సీఎం అంటున్నారు.. కానీ సీటు ఇవ్వరా? ఏందీ సోము ఇది..?

By:  Tupaki Desk   |   29 March 2021 8:57 AM GMT
కాబోయే సీఎం అంటున్నారు.. కానీ సీటు ఇవ్వరా? ఏందీ సోము ఇది..?
X
‘అంతన్నాడు.. ఇంతన్నాడే సోము వీర్రాజు.. చివరకు పవన్ కు ‘సీఎం’ అనే బిస్కెట్ వేశాడే’ అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారట.. కనీసం తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వని బీజేపీ పెద్దలు రేపు పొద్దున అధికారంలోకి వస్తే పవన్ కు సీఎం సీటు ఇస్తారా? అని నిలదీస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ యే సీఎం అన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి మాటలు వైరల్ అవుతున్నాయి.

ఏపీలోని రాజకీయం అంతా తిరుపతి ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక ఇక తిరుపతిని చేజిక్కించుకునేందుకు అధికార వైసీపీ పెద్దగా కష్టపడడం లేదు. ఇక తిరుపతి కనీసం పరువు కాపాడుకుందామని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నాయి.. ఇందులో భాగంగా టీడీపీ తరుపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దించిన టీడీపీ.. ఎలాగైనా గెలిపించాలని పార్టీ అధినేత చంద్రబాబు, నేతలు తీవ్రంగా తపనపడుతున్నారు. ఇక్కడ ఎటొచ్చి చిక్కల్లా బీజేపీ, జనసేనలకే.. ఆ పార్టీల తరుపున బరిలోకి దిగుతున్న రత్నప్రభను గెలిపించుకునేందుకు బీజేపీ మళ్లీ జనసేనను బుజ్జగిస్తుందా..? అనే చర్చ సాగుతోంది.

తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు బీజేపీ, జనసేనలు కలిసి పనిచేశాయి. అంథర్వేతి, రామతీర్థం లాంటి ఆందోళల్లో జోడీగా ఉద్యమించాయి. అయితే విశాఖ ఉక్కు, తిరుపతి బై ఎలక్షన్ విషయంలో పవన్ ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అగ్రనేతలను స్వయంగా కలిసి చర్చించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే తిరుపతిలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇక జనసేనను పట్టించుకుంటుందా..? అన్న విమర్శలు వచ్చాయి. అన్నట్లుగా పవన్ వినతిని కేంద్ర పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ తరుపున క్యాండెట్ ను నిలబెట్టింది.

అంతకుముందు ఏపీ బీజేపీకి అక్కడో ఇక్కడో కాస్త పేరుండేది. ఈ పార్టీకి జనసేన తోడవ్వడంతో కాస్త బలపడిందని చెప్పవచ్చు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసైనికుల బలంతోనే బీజేపీ కొన్ని వార్డులు గెలుచుకుందని విజయవాడకు చెందిన పోతినేని మహేశ్ అనే జనసేన నాయకుడు ఆరోపించాడు. అదీగాక పవన్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధ్య పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ ను కాదని బీజేపీ తిరుపతి అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇదిలా ఉండగా తిరుపతిలో బీజేపీకి గెలిచే అవకాశం కొంచెం తక్కువే. డిపాజిట్ దక్కడానికే బీజేపీ నాయకులు ఇప్పుడు తెగ కష్టపడుతున్నారన్న ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ కనుక ప్రచారం చేయకుంటే నోటా కంటే కూడా తక్కువ ఓట్లే వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకే ‘పవన్ సీఎం’ అని సోము వీర్రాజు బిస్కెట్ వేశాడని అంటున్నారు. అదీగాక గ్రౌండ్ లెవల్ లో బీజేపీ క్యాడర్ మరీ తక్కువ. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు మరోసారి పవన్ ను వాడుకుంటారా..? అన్న చర్చ వస్తోంది.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన పవన్ ను బీజేపీ పెద్దలు పిలిచి బరిలో ఉండకుండా చేశారు. ఆ తరువాత ఆయనపై రకరకాల కామెంట్లు చేయడంతో పవన్ నిరాశ చెంది తెలంగాణ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో మరోసారి సోము వీర్రాజు గ్రౌండ్ లెవల్లో పవన్ ను వాడుకోవడానికి కేంద్ర పెద్దలతో ఒప్పించనున్నారా..? అన్న కోణంలో టాక్ వినిపిస్తోంది. ఓవైపు పవన్ ను కాబోయే సీఎం అంటూనే కనీసం తిరుపతి సీటు ఇవ్వడంలో వెనక్కి తగ్గిన సోము వీర్రాజుపై సోషల్ మీడయాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు.