Begin typing your search above and press return to search.

ఇలాంటి లెక్కలు ఇప్పుడు చెబితే.. జనాలకు ఖాళీ పోద్ది నిర్మలమ్మ?

By:  Tupaki Desk   |   10 May 2021 4:07 AM GMT
ఇలాంటి లెక్కలు ఇప్పుడు చెబితే.. జనాలకు ఖాళీ పోద్ది నిర్మలమ్మ?
X
గతంలో ఎప్పుడు లేనట్లుగా.. రాష్ట్రాలు కేంద్రాన్ని ఆర్థిక సాయాన్ని కోరినా.. పన్ను తగ్గింపును అభ్యర్థించినా.. సానుకూల సమాధానం కంటే కూడా కౌంటర్ బదులుగా రావటం చూస్తున్నదే. ఇంతగా ఆచితూచి.. పినాసిగా వ్యవహరిస్తూ మోడీ సర్కారు సాధించిందేమైనా ఉందా? మిగిల్చింది మరేదైనా ఉందా? అంటే లేదని చెప్పాలి. అలాంటప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరే అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించే గుణం ఎందుకు మిస్ అవుతున్నట్లు?
ప్రతి సందర్భంలోనూ తామే కరెక్టు అన్నట్లుగా వ్యవహరించే కేంద్రం.. అదే నిజమైన పక్షంలో కరోనా లాంటి విపత్తును కంట్రోల్ చేసి ఉండాలి కదా? తప్పులు ఎవరైనా చేయొచ్చు. కానీ.. వాటి విపరిణామాలు మొదలైన వెంటనే వాటికి చెక్ పెట్టేందుకు వీలుగా చర్యలు చేపట్టాల్సింది. కానీ.. అలాంటిదేమీ మోడీ సర్కారులో కనిపించని దుస్థితి. తాజాగా మరో రచ్చకు తెర తీసేట్లున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

కోవిడ్ వేళ వినియోగిస్తున్న వైద్య పరికరాలు.. ఔషధాలపై అన్ని రకాల పన్నులు.. కస్టమ్స్ సుంకాల్ని రద్దు చేయాలని బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. తాజాగా ఆమె ప్రధాని మోడీకి లేఖ రాస్తూ.. కొవిడ్ సంబంధిత మందులు.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు.. సిలిండర్లు.. కంటెయినర్లు విరాళంగా ఇస్తామని అనేక సంస్థలు.. వ్యక్తులు ముందుకు వస్తున్నారని.. వారికి పన్ను మినయిహాంపు ఇవ్వాలన్నారు. ప్రధాని మోడీకి లేఖ రాస్తే..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

సోషల్ మీడియాలో ఆమె ఈ లేఖలోని అంశాలకు సమాధానాల్ని కౌంటర్ రూపంలో చెప్పుకొచ్చారు. సాంకేతిక అంశాలు చెప్పి.. బుర్రలు చెడగొట్టే కన్నా.. నిర్మలమ్మ చెప్పిన మాటల్ని సింఫుల్ గా ఒక్క లైన్ లో చెప్పేయాలంటే.. మీరు చెప్పినట్లు పన్నులు తగ్గిస్తే.. వాటి ధరలు మరింతగా పెరుగుతాయి.. వినియోగదారులకు ఇబ్బందిగా మారుతుందన్నారు. ఏతావాతా మమతమ్మ చేసిన సూచన సాధ్యం కాదని తేల్చారు. వ్యాక్సిన్ దేశీయ సరఫరా.. వాణిజ్య దిగుమతులపై 5 శాతం జీఎస్టీ ఉండగా.. కొవిడ్ ఔషధాలు.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లపై 12 శాతం పన్ను ఉంది. నిర్మలమ్మ వివరించిన పెద్ద లెక్కల్ని అర్థం చేసుకునే బుర్ర మనలాంటి సామాన్యులకు లేదనే ఫిక్స్ అవుదాం. మనలో మన మాటగా చిన్న లాజిక్ తో ఒక ఆలోచన చేద్దాం.

అసలు దేశ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు అనుమతులు ఇస్తే వచ్చే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఎన్ని ఉంటాయి. కోటి వేసుకుందామా? అదే చాలా.. చాలా ఎక్కువ. ఒక్కో కాన్సన్ ట్రేటర్ల విలువ సరాసరి 60 వేలు వేసుకుందాం. కాదు లక్ష రూపాయిలా? మీ మాట ప్రకారమే లక్ష వేద్దాం. దాని మీద 12శాతం జీఎస్టీ అంటే.. ఒక్కోదాని మీద 12వేల పన్ను ఆదాయం కేంద్రానికి వస్తుంది. కోటి మెషిన్ల మీద ప్రభుత్వానికి వచ్చేది 1.20లక్షల కోట్లు. ఇదంతా మనం కాగితాల మీద వేసుకుంటే వచ్చే లెక్కలు. వాస్తవానికి మెషిన్ ఖరీదు ఇంత భారీగా ఉండదు. చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో విపరీతంగా పెంచేశారు. 10కేజీల కాన్సట్రేటర్ ఖరీదు కరోనాకు ముందు 40 - 50 వేల మధ్యలో ఉండేది.. పన్నులతో కలిపి. ఇప్పుడు దాన్ని మార్కెట్లో లక్ష నుంచి రూ.1.20లక్షల మధ్య అమ్ముతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితి.. వారి ప్రాణం కంటే మరేదీ ముఖ్యం కాదు కదా? అలాంటప్పుడు పన్ను రూపంలో వచ్చే ఆదాయం గురించి అనవసరమైన ఆలోచనలు.. లెక్కలు ఎందుకు? కేంద్రం వసూలు చేసే జీఎస్టీలో రాష్ట్ర వాటా ఉంటుందన్న మాట చెబుతూ.. వారికే ఎక్కువ వెళుతుందని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. ప్రజల ప్రాణాలే ముఖ్యం తప్పించి.. వారి ప్రాణంతో ఆటలు ఆడేలా ఉండే పన్ను ఆదాయం వద్దు అని రాష్ట్రం కోరినప్పుడు.. వారి మాటను మన్నించటం మానేసి.. ఈ మొండితనం ఏమిటి? కాసుల కక్కుర్తి తప్పించి.. ఈ దేశంలో ఇంకేమీ ఉండదా?

ధరలు పెరుగుతాయన్న నిర్మలమ్మ ఆందోళనను పరిగణిలోకి తీసుకుందాం. ఫలానా కాన్సట్రేటర్ల ధర ఇంత ఉండాలి? అందులో ఏముండాలన్నవిషయాన్ని క్లియర్ గా చెప్పటంతో పాటు.. సింఫుల్ గా రెండు పోస్టులు సోషల్ మీడియాలోనూ.. ప్రభుత్వం వార్తల రూపంలో ప్రకటిస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే షేర్ చేసుకుంటారు. అయినప్పటికి ఎవరైనా కక్కుర్తి పడితే.. వారి యూనిట్లను స్వాధీనం చేసుకోవటం.. భారీగా జరిమానా విధిస్తే ఒక్కసారి తిక్క కుదురుతుంది. సిస్టమ్ గాడిలోకి వస్తుంది.

అలాంటిది వదిలేసి.. ప్రాణాలు పోయే వేళ.. పనికిరాని లెక్కల గురించి ఎంత చెబితే లాభం ఏముంది? శవాల మీద పేలాలు ఏరుకునేలా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పన్ను ఆదాయం గురించిన చర్చ అవసరమా? కోవిడ్ సెకండ్ వేవ్ వేళ.. ఇప్పటివరకు జాతి ప్రజలు చెల్లించిన మూల్యం సరిపోదా? ఈ కరోనా కాష్టం ఇంకా కాలుతూనే ఉండాలా? వాటిపై వచ్చే ఆదాయంలో బాధితుల ఉసురే ఉంటుంది తప్పించి.. ఆనందం ఉండదు. మూర్తీభవించిన మొండితనంతో.. రాష్ట్రాలు.. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పే మాటల్ని లెక్క చేయని మీ మూర్ఖత్వానికి ఈ దేశం చెల్లిస్తున్న మూల్యం సరిపోదా? మరింత కోరుకుంటున్నారా?