Begin typing your search above and press return to search.

అంటే... సార్, మీ ఇద్దరు ఆరోజు తిట్టుకున్నారు కదా? !

By:  Tupaki Desk   |   22 Nov 2021 6:56 AM GMT
అంటే... సార్, మీ ఇద్దరు ఆరోజు తిట్టుకున్నారు కదా? !
X
`ఆరు నూరైనా.. విద్యుత్ ఉత్ప‌త్తి ఆపేదేలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి! ఎవ‌రికి చెప్పుకొంటారో .. చెప్పుకోండి!` అంటూ.. కొన్ని నెల‌ల కింద‌ట ఏపీని ఉద్దేశించి.. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇక‌, మీ ప్రాజెక్టుల‌ను అడ్డుకుంటాం. అంటూ.. ఇటు ఏపీ నుంచి కూడా అదేస్థాయిలో ఫైర్ వ్యాఖ్య‌లు వినిపించాయి. ఇక‌, కేసీఆర్ బృందం వైఎస్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టింది. ఇక‌, జ‌గ‌న్‌ను కూడా ఏకేసింది. ఇటీవ‌లే.. జ‌గ‌న్ కేంద్రంలో అడుక్కుంటున్నాడు .. అంటూ కామెంట్లు చేశారు. అదేస‌మ‌యంలో మీరు బ‌య‌ట‌కు కాల‌ర్ ఎగ‌రేసి.. లోప‌ల కాళ్లు పట్టుకుంటున్నార‌ని.. ఏపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. దీంతో .. అందరూ.. ఇక‌, ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు.. మ‌రింత ముదిరాయ‌ని ఇక‌, ఎప్ప‌టికీ క‌లిసే అవ‌కాశం లేద‌ని అనుకున్నారు.

క‌ట్ చేస్తే.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ కలిశారు. అంతేకాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధారెడ్డి పెళ్లి వేడుక లో ఒకే సీటులో ప‌క్క ప‌క్క‌న కూర్చున్నారు. హైద‌రాబాద్ శివారు.. శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఏపీ సీఎం జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి వివాహం జ‌రిగింది.

అయితే.. నిన్న‌టి వ‌ర‌కు క‌త్తులు నూరుకుని.. కామెంట్లు విసురుకున్న‌.. కేసీఆర్, జగన్ ఈ వివాహంలో చాలా దగ్గరగా కూర్చుకుని ముచ్చటించుకోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది. ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదంపై అటు ఏపీ మంత్రులు, ఇటు తెలంగాణ మంత్రులు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టుపై ఏపీ అభ్యతరం చెబుతోంది. అట్లాగే ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ అడ్డుకుంటోంది. జలాల పంపిణీ పై రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. జల వివాదమే కాకుండా ఆర్థిక పరమైన అంశాల పై కూడా తెలంగాణ మంత్రి నిరంజన్‌ రెడ్డి, జగన్ ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మంత్రి వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్నినాని కూడా ఘాటు గానే జవాబిచ్చారు.

ఈ నేప‌థ్యం లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం, ఇతర అంశాల నేపథ్యం లో సీఎంలిద్దరూ ఎదురు పడినా మాట్లాడుకోరని అందరూ అనుకున్నారు. అయితే అనుకో కుండా ఇద్దరి సీఎంలను పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం దగ్గరకు చేర్చింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నట్లు అర్థమవుతోంది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుని సమస్యలను పరిష్క‌రించే అవకాశం ఉన్న రాజకీయ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య ఆజ్యం పోస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. మ‌రికొంద‌రు.. నెటిజ‌న్లు.. ఇప్ప‌టి వ‌ర‌కు మీరు నాట‌కాలు ఆడారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీని పై నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.