Begin typing your search above and press return to search.

భారత భూభాగంతో నేపాల్ కొత్త మ్యాప్.. తీవ్ర దుమారం

By:  Tupaki Desk   |   14 Jun 2020 12:30 AM GMT
భారత భూభాగంతో నేపాల్ కొత్త మ్యాప్.. తీవ్ర దుమారం
X
నేపాల్ పార్లమెంట్ అన్నంత పనిచేసింది. భారత్ లోని భూభాగాలను కలుపుతూ కొత్త నేపాల్ దేశ మ్యాప్ కు ఆమోదముద్ర వేసింది. దీంతో భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది.

కొద్దిరోజులుగా భారత్ లోని కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా అనే ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ దేశం పేచీ పెడుతోంది. ఆ మూడు ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది.

అయితే భారత వాదనను పెడచెవిన పెట్టిన నేపాల్ తాజాగా ఆ దేశ రాజ్యాంగంలోని షెడ్యూల్ 3ని సవరిస్తూ కొత్త మ్యాప్ పై తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. దేశ చిహ్నంలో కూడా కొన్ని మార్పులు చేసింది. నేపాల్ ప్రధాన ప్రతిపక్షాలైన నేపాలి కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాపార్టీ నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఆమోదం తెలుపడం విశేషం. మొత్తం 275మంది సభ్యులన్న నేపాల్ పార్లమెంట్ లో మూడింట రెండో వంతు మెజార్టీ అవసరం కాగా.. ప్రభుత్వం సునాయసంగా గెలిచింది.

నేపాల్ తాజాగా భారత్ లోని భూభాగాలను తన కొత్త మ్యాప్ లో తమదేశానికి చెందినవిగా చూపించింది. ఈ మూడు ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రం కిందకు వస్తాయని భారత్ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ ఈ వివాదంపై స్పందించింది. భారత భూభాగాన్ని తమ భూభాగంలోకి కలిపివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ చర్యకు పూనుకోవడం సరైందికాదన్నారు.