Begin typing your search above and press return to search.

నయీంతో ఆ ఎమ్మెల్యేలు బాతాకానీ!

By:  Tupaki Desk   |   7 Sep 2016 4:28 AM GMT
నయీంతో ఆ ఎమ్మెల్యేలు బాతాకానీ!
X
నయీమ్‌ అనే వ్యక్తి ఒక గ్యాంగ్ స్టర్ అని తెలిసినా కూడా ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజాసేవే తన లక్ష్యమని - ధ్యేయమని చెప్పుకునే ఎమ్మెల్యేలకు ఏమి పని? ఆ గ్యాంగ్ స్టర్ తో కూర్చుని కాఫీ తాగుతూ - టిఫిన్ తింటూ - బాతాకానీ కొడుతూ గడిపేటంత అవసరం ఏముంది? ఆ స్థాయి చనువు ఉండటంవల్లే అలాంటి ఒక వ్యక్తి గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడా? ఈ సందేహాలను వ్యక్తపరుస్తున్నాయి తాజాగా దొరికిన కొన్ని ఫోటోలు. నయీం కేసు దర్యాప్తు చేసిన అధికారులకు తాజాగా కొన్ని ఫోటోలు దొరికాయి.. ప్రస్తుతం ఇవి రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే నయీమ్‌ తో కలసి ఉన్న ఫొటోలను చూసి దర్యాప్తు వర్గాలు విస్తుపోయాయట. అసలు ఎమ్మెల్యే కు ఆ గ్యాంగ్ స్టర్ తో ఏమి పని అనే కోణంలో దర్యాప్తు షురూ చేశారట. ఈ దర్యాప్తులో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ ఎమ్మెల్యే మెడకు నయీం ఉచ్చు బిగుసుకున్నట్లేనని సమాచారం. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనుచరులకు కూడా నయీమ్ పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూర్చాడని తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారానికి తోడు మరో ఎమ్మెల్సీకి సంబంధించిన ఆధారాలూ కూడా దర్యాప్తు వర్గాలకు లభించాయి.

ఈ ఎమ్మెల్యేల్లో నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే నయీంతో ఒకసారి చాయ్ తాగుతూ - మరోసారి టిఫిన్ చేస్తూ - కూర్చుని మాట్లాడుతూ మరో రెండుసార్లు ఉన్న ఫొటోలు దర్యాప్తు వర్గాలకు లభించాయి. షాద్‌ నగర్ డెన్‌ కు సాధారణంగా ఎవరినీ అనుమతించని నయీమ్ ఈ ఎమ్మెల్యేను ఎలా అనుమతించాడు? ఎందుకు అనుమతించాడనే కోణంలో దర్యాప్తు వర్గాలు సీరియస్‌ గా విచారణ చేస్తున్నాయి. ఇదే క్రమంలో మరో ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న వ్యక్తి ముఖ్య అనుచరుడయిన ఒకరికి యాదగిరిగుట్ట సమీపంలో సుమారు కోటి రూపాయలు విలువైన భూమిని రూ.20 లక్షలకే ఇప్పించాడని కూడా అంటున్నారు.