Begin typing your search above and press return to search.

నయీంతో ఫ్రెండ్షిప్ ఉన్న మంత్రులెవరు?

By:  Tupaki Desk   |   15 Aug 2016 6:03 AM GMT
నయీంతో ఫ్రెండ్షిప్ ఉన్న మంత్రులెవరు?
X
గ్యాంగ్‌ స్టర్ నయీంతో సన్నిహితంగా మెలిగిన వారి కోసం మహబూబ్‌ నగర్ జిల్లా షాద్‌ నగర్ ప్రాంతంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ జాబితాలో ముగ్గురు మంత్రులు - ఎమ్మెల్యేలు - ఇతర నేతలు ఉన్నట్లు సిట్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినట్లు ఇప్పటికే బయటకు పొక్కింది. ఈ నివేదికలో ఉన్న నేతలు నిజంగాన నయీంతో సన్నిహితంగా మెలిగారా? లేదా అనే విషయాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. శంషాబాద్‌ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా షాద్‌ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు - కేశంపేట - ఫరూఖ్‌ నగర్ - కొందుర్గుతో పాటు బాలానగర్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అయనప్పటికీ ఆంధ్రా - కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు ఈ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేయడంతో భూ వివాదాలు కూడా అంతే స్థాయలో తలెత్తాయ. వీటి నుంచి బయటపడేందుకు కొందరు నయీం గ్యాంగ్‌ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యాపారులకు అధికార పార్టీ నాయకులు అండగా ఉండటంతో రెవెన్యూ అధికారులు వారికి లొంగిపోయ అమాయక ప్రజలకు నష్టం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో భూస్వాములు, పలుకుబడి గల నాయకులు అక్రమంగా అమాయకుల భూములను ఆక్రమిస్తున్నారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక పంపడంతో షాద్‌ నగర్ డిఎస్పీ స్థాయిలో ఐపిఎస్ అధికారిని నియమించారు. ప్రస్తుతం భూఆక్రమణలు జరగకుండా కొంతవరకు నిరోధించినప్పటికీ భూములు కోల్పోయన బాధితులు నయీం గ్యాంగ్‌ ను ఆశ్రయించారేమోనన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

షాద్ నగర్ ప్రాంతంలో అధికార పార్టీ నాయకులతోపాటు పోలీస్ అధికారులు - మాజీ మంత్రులు అనేకమందికి భూములు మామిడితోటలు ఉన్నాయ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో అక్రమాలు - భూదందాలు - కిడ్నాప్‌ లు - హత్యలకు పాల్పడిన నయీం గ్యాంగ్ తమ నివాసానికి ఈ ప్రాంతాన్ని సరైనదిగా ఎంచుకున్న తర్వాతే షాద్‌ నగర్ మిలీనియం టౌన్‌ షిప్‌ లో ఇల్లు ఖరీదు చేశారని భావిస్తున్నారు. ఇక్కడున్న నయీం అడ్డాకు ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా వచ్చేవారని తెలుస్తోంది. అయితే.. నయీంతో సంబంధాలున్నాయని ముగ్గురు మంత్రులపై ఆరోపణలు రావడంతో వారెవరా అన్న చర్చ సాగుతోంది.