Begin typing your search above and press return to search.

సంచలన వ్యాఖ్యలతో కేసీఆర్ కు షాకిచ్చిన నాయిని

By:  Tupaki Desk   |   9 Sept 2019 3:55 PM IST
సంచలన వ్యాఖ్యలతో కేసీఆర్ కు షాకిచ్చిన నాయిని
X
తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించటమే కాదు.. తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వర్తించారు నాయిని నర్సింహారెడ్డి. నాయిని మాటలు విన్న ఇప్పటోళ్లు ఆయన్ను తక్కువగా అంచనా వేస్తారు. కానీ.. నాయిని బ్యాక్ గ్రౌండ్.. అందునా యూత్ లో ఉన్నప్పుడు కార్మిక నేతగా ఆయన చేసిన ఉద్యమాలు.. పోరాటాలు వింటే.. అప్పట్లో ఇవన్నీ చేశారా? అనిపించక మానదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకిచ్చారని చెప్పాలి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు పలువురు ఒకరుతర్వాత మరొకరు చొప్పున కేసీఆర్ ప్రభుత్వం పైన.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ తప్పు పట్టేలా మాట్లాడటం సంచలనంగా మారింది.

ఈ మధ్యనే గులాబీ పార్టీ ఓనర్లమని ఈటల స్పష్టం చేస్తే.. దానికి కౌంటర్ ఇచ్చే వరకూ నిద్ర పోలేదు ఎర్రబెల్లి. ఇదిలా ఉంటే.. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో నాయిని బరస్ట్ అయ్యారు. తనకు ఇస్తామని చెబుతున్న ఆర్టీసీ ఛైర్మన్ పదవి తనకు అక్కర్లేదన్నారు. సీఎం కేసీఆర్ కు అనకున్న అసంతృప్తిని ఓపెన్ గా వెళ్లగక్కేశారు నాయిని.

తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారన్నారు. ఎన్నికల్లో తాను ఎమ్మెలయేగా పోటీ చేస్తానని చెబితే.. కౌన్సిల్ లో ఉండు.. మంత్రి పదవి ఇస్తానని చెప్పారన్నారు. తనకే కాదు తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. కానీ.. చెప్పిన మాటలేమీ చేయలేదన్న అర్థం వచ్చేలా మాట్లాడిన నాయిని.. మరో కీలక వ్యాఖ్య చేశారు.

తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తానంటున్న ముఖ్యమంత్రికి.. తనకు ఆ పదవి వద్దని.. అందులో రసం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఇంటికి పెద్ద అని.. తామంతా ఓనర్లమేనని చెప్పిన ఆయన.. కిరాయిదారులు ఎంతకాలం ఉంటారో వాళ్లిష్టంగా తనలోని ఆగ్రహాన్ని కొత్త తరహాలో వ్యక్తం చేసి హాట్ టాపిక్ గా మారారు నాయిని.