Begin typing your search above and press return to search.

సర్జికల్ స్ట్రైక్స్ 2.. సిద్ధు అనుమానాలు

By:  Tupaki Desk   |   5 March 2019 5:42 AM GMT
సర్జికల్ స్ట్రైక్స్ 2.. సిద్ధు అనుమానాలు
X
పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ భారత వాయుసేన విమానాలు ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి 350మంది వరకు ఉగ్రవాదులను చంపేశాయని దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కొందరు దేశంలోని అతివాదులు మాత్రం ఇదంతా ఫేక్ అంటున్నారు. బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ చేసిందనడానికి.. ఉగ్రవాదుల్ని చంపిందనడానికి సాక్ష్యమేదని ప్రశ్నిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అలాంటి సంచలన కామెంట్స్ చేశారు.

తాజాగా సిద్దూ మాట్లాడుతూ.. ‘మన వాళ్లు అక్కడ సర్జికల్ స్ట్రైక్స్ చేశారా లేదా అక్కడ ఉగ్రవాదుల్ని చంపారా? లేక చెట్లు పీకారా?’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత వాయుసేన బాలాకోట్ లో ఉగ్రవాదుల్ని చంపిందనడానికి సాక్ష్యమేదని సిద్దూ సూటిగా ప్రశ్నించారు.

‘యుద్ధంలో ఎప్పుడూ కూడా నిజం మొదటగా ఓడిపోతుంది. పాకిస్తాన్ లో భారత్ నిర్వహించిన దాడుల్లో తీవ్రవాదులను మట్టుబెట్టడం నిజమేనా? విదేశీ శత్రువుతో పోరాడామని మన గడ్డ మోసం బారిన పడుతోంది. మీరు తీవ్రవాదులను ఏరివేస్తున్నారా? లేక చెట్లు పీకుతున్నారా? ఇదంతా ఎన్నికల గిమ్మిక్కేనా? 300 మంది తీవ్రవాదులు చనిపోయారంటున్నారు. అవునా.? కాదా ఇక ఇప్పుడు మీ ఉద్దేశం ఏమిటీ? ఆర్మీని రాజకీయాలకు వాడుకోవడం మానండి.. దేశం ఎంత గొప్పదో.. సైన్యం కూడా అంతే గొప్పది’ అని సిద్దూ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.

పుల్వామా దాడి తర్వాత కూడా సిద్దూ అందరూ పాకిస్తాన్ ను తిడుతుంటే.. పాకిస్తాన్ ను వెనకేసుకొచ్చాడు. ఉగ్రవాదులు చేసిన తప్పుకు పాకిస్తాన్ ను తిడుతారా అని వ్యాఖ్యానించి విమర్శలు తెచ్చుకున్నారు. ఇప్పుడు భారత వాయుసేన దాడులపై కూడా నోరుజారి చిక్కుల్లో పడ్డాడు.