Begin typing your search above and press return to search.

పాక్ ప్రధాని మాట: సిద్ధూ పాకిస్థాన్లోనూ గెలుస్తాడు

By:  Tupaki Desk   |   29 Nov 2018 5:01 AM GMT
పాక్ ప్రధాని మాట: సిద్ధూ పాకిస్థాన్లోనూ గెలుస్తాడు
X
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినపుడు ఆ కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్.. పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వెళ్లడం.. ఆ దేశ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసుకోవడం.. ఇమ్రాన్ తనకు అక్కడ పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోయినా సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమయంలో సిద్ధూను ఎందుకు విమర్శించారో అర్థం కాలేదని అన్నాడు ఇమ్రాన్. తాజాగా సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌ లోని గురుద్వార దర్బార్‌-కర్తాపూర్‌ నుంచి భారత్‌ గురుదాస్‌ పూర్‌ లోని డేరాబాబా నానక్‌ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమానికి కూడా సిద్ధూ అతిథిగా హాజరయ్యాడు.

ఈ నేపథ్యంలో సిద్ధూకు ఇమ్రాన్ బాసటగా నిలిచాడు. సిద్ధూ పాకిస్థాన్ లోని పంజాబ్ లో ఎన్నికల్లో పోటీ పడ్డా గెలుస్తాడని అన్నాడు. ‘‘సిద్దూను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా ప్రమాణస్వీకారానికి వచ్చి అతను శాంతిని.. స్నేహభావాన్ని పెంచాడు. సిద్ధూ ఇక్కడి పంజాబ్‌లో పోటి చేసినా గెలిచి తీరుతాడు’ అని ఇమ్రాన్‌ చెప్పాడు. పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ.. సిక్కుల 70 ఏళ్ల నిరీక్షణకు ఇమ్రాన్‌ ఖాన్‌ తెరదించారని అన్నాడు. సిక్కుల పవిత్ర గురువైన గురునానక్‌ తన జీవిత చరమాంకంలో కర్తాపూర్‌ లో జీవించారు. గురునానక్‌ 550వ జయంతి నాటికి భారత్‌-పాక్‌ ల మధ్య ఈ కారిడార్‌ ఏర్పాటు కావాలని చాలా మంది సిక్కులు కోరుకున్నారు. ఈ కారిడార్‌ను ఆరు నెలల్లో పూర్తిచేయాలనుకుంటున్నారు. ఇది పూరైతే సిక్కు భక్తులు ఎటువంటి వీసా లేకుండానే కర్తాపూర్‌ ను సందర్శించవచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టన్‌ అమరీందర్‌ సింగ్‌ గురుదాస్‌ పూర్‌ లో ఇండియాలోని కారిడార్‌కు మంగళవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.