Begin typing your search above and press return to search.

మోదీకి ఆ సీఎం బాసట... మరి వారు... ?

By:  Tupaki Desk   |   7 Jan 2022 4:30 PM GMT
మోదీకి ఆ సీఎం బాసట... మరి వారు... ?
X
ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల పంజాబ్ టూర్ లో జరిగిన భద్రతాపరమైన అవరోధం మీద దేశమంతా చర్చ సాగుతోంది.అది భద్రతా వైఫల్యం అని ఒక వైపు విమర్శలు ఉంటే మరో వైపు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ఏది ఎలా ఉన్నా ప్రధాని వాహనాన్ని అలా ఇరవై నిముషాల పాటు ఫ్లై ఓవర్ మీద అడ్డగించడం అంటే అది పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. ఈ నేపధ్యంలో ఒడిషా ముఖ్యామంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీకి బాసటగా నిలిచారు.

ఆయన తాజాగా ట్వీటు చేస్తూ ప్రధానమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైన పదవి, ప్రధాని దేశానికే అత్యున్నతమైన వ్యవస్థ. అలాంటి ప్రధానికే భద్రత లేకుండా చేయాలనుకోవడం దారుణమని చెప్పారు. ప్రధాని పదవిలో ఎవరున్నా కూడా భద్రతను పూర్తి స్థాయిలో కల్పించడం ప్రతీ ప్రభుత్వ విధి అని కూడా నవీన్ పట్నాయక్ గట్టిగా నొక్కి చెప్పారు.

దాంతో నవీన్ రాజనీతిజ్ఞత, దార్శనికత ఈ సందర్భంగా వెల్ల‌డైంది అంటున్నారు. ఆయన సాధారణంగా దేశ రాజకీయాలలో వేలు పెట్టరు. ఆయన పెద్దగా జోక్యం చేసుకోరు. తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఆయన ఢిల్లీకి కూడా వెళ్లరు. కానీ రెండు దశాబ్దాలుగా ఆయన ఒడిషాలో గెలుస్తూనే ఉన్నారు.

ఇక ఒడిషాలో బీజేపీ ఆయనకు రాజకీయ ప్రత్యర్ధిగా ఉంది. అయినా సరే ఆయన ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. బాసటగా నిలిచారు. పంజాబ్ లో జరిగింది తప్పు అని ఎత్తి చూపారు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ని కూడా విమర్శించారనే అనుకోవాలి. ఆయన సంగతి సరే కానీ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అన్న చర్చ అయితే వస్తోంది.

పొరుగున ఉన్న తమిళ సీఎం స్టాలిన్ అయితే యూపీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేరు. ఇక కేరళలో లెఫ్ట్ పార్టీ పవర్ లో ఉంది. వారి నుంచి కూడా రియాక్షన్ ఆశించలేము, కానీ తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ కూటమిలో లేరు. అయినా ఇది రాజకీయాలతో సంబంధం లేని విషయం. సోషల్ మీడియాలో సైతం మేధావులు ప్రధాని మోడీ విషయంలో పంజాబ్ సర్కార్ దే తప్పు అని నిక్కచ్చిగా చెబుతున్నారు. రాజకీయంగా మోడీతో బీజేపీతో వ్యతిరేకించవచ్చు కానీ దేశ ప్రధానికి జరిగిన అవమానం మీద అంతా మాట్లాడాల్సిందే అన్న వారే ఇపుడు కనిపిస్తున్నారు.

అలాంటిది తెలుగు రాష్ట్రాల నుంచి దీని మీద ఏ ఒక్క స్టేట్మెంట్ లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అన్నిటికీ మించి బీజేపీ మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ విషయంలో తన స్పందనను ఎక్కడా వ్యక్తం చేయలేదు. మొత్తానికి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం తన రాజనీతిని రుజువు చేసుకున్నారు అంటున్నారు. నిత్య మౌనిగా ఉండే ఆయన ఎపుడు రియాక్ట్ అవాలో కూడా తెలిసిన నాయకుడు అని అంటున్నారు.