Begin typing your search above and press return to search.

‘‘పాటియాల హౌజ్’’ అసలు కథ

By:  Tupaki Desk   |   20 Dec 2015 4:08 AM GMT
‘‘పాటియాల హౌజ్’’ అసలు కథ
X
గత కొద్దిరోజులుగా పాటియాలా హౌజ్ కోర్టు మాట తరచూ మీడియాలో వినిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కోర్టుకు రావాలని ఆదేశించటం.. వారు గైర్హాజరు కావటంతో.. డిసెంబర్ 19న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలన్న ఆదేశంలో శనివారం(డిసెంబర్ 19న) కోర్టుకు హాజరు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలోని పాటియాల కోర్టువైపే అందరి కళ్లు కేంద్రీకృతమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి అధినేత స్థానంలో ఉన్న సోనియాను కోర్టు మెట్లు ఎక్కేలా చేయటం పాటియాలా కోర్టుకే చెల్లింది. ఇంతకీ పాటియాలా కోర్టు పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుకున్న కథేంటన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ కు దగ్గరల్లో ఉండే ఈ కోర్టు సముదాయం గతంలో ఫ్యాలెస్ కావటం గమనార్హం. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న ఆరు జిల్లా కోర్టుల్లో ఒకటిగా చెప్పపొచ్చు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన భవనాన్ని ఇప్పుడు కోర్టుగా నడుస్తోంది. పటియాలా ప్రావిన్స్ మహరాజు నివాసంగా ఉండే ఈ భవనాన్ని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సదరు రాజకుటుంబం ఈ భవనాన్ని ప్రభుత్వానికి అమ్మేసింది. అనంతరం ఈ భవనాన్ని జిల్లా కోర్టుల సముదాయంగా మార్చారు. 1978 నుంచి ఈ భవనంలో కోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1997లో పార్లమెంటు వీధిలో ఉన్న క్రిమినల్ కోర్టును ఇక్కడకు మార్చటంతోఇప్పుడు పాటియాలా హౌజ్ లో మొత్తం 30కిపైగా కోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది.