Begin typing your search above and press return to search.

అమ్మా కొడుకులిద్దరూ కోర్టుకు వెళ్లకున్నా..?

By:  Tupaki Desk   |   8 Dec 2015 6:48 AM GMT
అమ్మా కొడుకులిద్దరూ కోర్టుకు వెళ్లకున్నా..?
X
దేశానికి దిశ.. దశ తామేనని బలంగా నమ్మే గాంధీ కుటుంబ సభ్యులకు కోర్టులు.. అవి ఇచ్చే ఆదేశాలు పెద్దగా పట్టవా? అంటే.. అవుననే విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది.

ఈ కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ అమ్మాకొడుకులు పెట్టుకున్న పిటీషన్ ను పాటియాలా కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో వారిద్దరూ కోర్టుకు హాజరు అవుతారా? అన్న ఆసక్తి వ్యక్తమైంది. అయితే.. కోర్టుకు వెళ్లే విషయంలో సోనియా.. రాహుల్ లు లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయమే.. ఈ కేసు వేసిన సీనియర్ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కోర్టుకు హాజరు కాగా.. సోనియా.. రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు.

కోర్టు విషయాన్ని వదిలేసిన రాహుల్.. తమిళనాడులోని వరద బాధితుల్ని పరామర్శించే కార్యక్రమాన్ని పెట్టుకోవట గమనార్హం. ఇక.. సోనియాగాంధీ నుంచి ఎలాంటి స్పందనా లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం.. ఈ కేసుకు సంబంధించిన తదుపరి చర్యల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. అదృశ్య శక్తిగా.. రిమోట్ కంట్రోల్ గా వ్యవహరించిన పదేళ్లు దేశాన్ని ఏలిన అమ్మ.. కోర్టుకు అంత తేలిగ్గా వస్తారా? అన్న వ్యాఖ్య వినిపిస్తోంది.

కోర్టు ఆదేశాలకు భిన్నంగా సోనియా.. రాహుల్ లు పాటియాలా కోర్టుకు హాజరు కాకపోవటంపై కోర్టు స్పందించింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం బిజీగా ఉన్న కారణంగా రావటం సాధ్యం కాలేదన్న వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఈ నెల 19న వ్యక్తిగతంగా సోనియా.. రాహుల్ ఇద్దరూ హాజరుకావాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.