Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాల‌కు ఢిల్లీ క్లాస్‌

By:  Tupaki Desk   |   11 Jan 2016 5:35 AM GMT
తెలుగు రాష్ర్టాల‌కు ఢిల్లీ క్లాస్‌
X
తెలుగు రాష్ర్టాల‌కు మ‌ళ్లీ హ‌స్తినా త‌ల అంటింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ రాష్ర్టాలు గిల్లిక‌జ్జాలు పెట్టుకోవ‌డం, నిధుల కోసం త‌మ‌లో తాము వాదులాడుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌చ్చిప‌డిందేమో అనుకోకండి. ఈ ద‌ఫా కేంద్ర ప్ర‌భుత్వం కాదు... స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంతో స‌మాన‌మైన హోదా ఉన్న జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) త‌న హాట్ కామెంట్స్‌ తో ఫైర్ అయింది.

ఇసుక తవ్వకాలకు యంత్రపరికరాలు వినియోగించ వద్దని, పర్యావరణ అనుమతులు లేని ఇసుక క్వారీలను కొనసాగించవద్దని కోరుతూ పలువురు ఫిర్యాదు దాఖలు చేసిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ తాజా తీర్పు ఇచ్చింది. త‌వ్వ‌కాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ యంత్రాలు వాడ‌కుండా ఇసుకను సేక‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఎన్జీటీ ఇచ్చిన తాజా ఉత్తర్వులతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇసుక అమ్మకాల ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోందని చెప్పుకుంటున్న రెండు రాష్ట్రాల దూకుడుకు ఎన్జీటీ తీర్పు బ్రేక్ వేసినట్టేనని అధికారులు చెప్తున్నారు.

రెండు రాష్ర్టాల్లోనూ ఇసుక మాఫియా తీవ్ర వివాదాస్ప‌దంగా మారింది. తెలంగాణలో గోదావరి - కృష్ణా - మంజీరా నదులపై భారీ యంత్ర పరికరాలతో ఇసుక తవ్వకాలను కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగానికి 10 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచీ కనీసం ఒక కోటి క్యూబిక్‌ మీటర్లకు తగ్గకుండా ఇసుక తవ్వాలని నిర్ణయించి ఈ బాధ్యతలను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు అప్పగించింది. రెండు ప్రధాన నదులతో పాటు మూడు ఉపనదులపై యంత్ర పరికరాలతో ఇసుక తవ్వకాలు చేసుకునే విధంగా రైజింగ్‌ కాంట్రాక్టర్లను నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 600 కోట్ల ఆదాయం సంపాదించిన తెలంగాణ ప్రభుత్వంవచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. వెయ్యి కోట్లకు ఆదాయం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక క్వారీలను డ్వాక్రా, స్వయం సహాయక బృందాలకు అప్పగించినప్పటికీ వీరికి బినామీలుగా అధికార పార్టీకి చెందిన పలువులు మంత్రులు - శాసనసభ్యులు - వారి అనుచర బృందం ఇసుక కాంట్రాక్టర్ల అవతారం ఎత్తార‌ని వివాదాలు మొద‌ల‌య్యాయి. ఎమ్మార్వో వ‌న‌జాక్షి-ఎమ్మెల్యే చింత‌మ‌నేని వివాదం ప్ర‌భుత్వం ప‌రువును బ‌జారున ప‌డేసింది. ఇసుక మాఫియాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అధికార పార్టీ ప్రముఖులే చంద్రబాబు ముందు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇసుక విధానంలో మార్పులు తీసుకు రావాలని నిర్ణయించారు.

ఇరు రాష్ర్టాల్లోనూ అక్రమ ఇసుక వ్యాపారంలో కొంద‌రు మంత్రులు, పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల ప్రమేయం ఉందని విమర్శలు పెల్లుబికినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తాజాగా గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నాయి. నది ఇసుక స్థానంలో రాతి ఇసుకను వినియోగిస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియ‌జెప్పేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాయి.