Begin typing your search above and press return to search.

మాల్యా బ్యాచ్ కి మోడీ వార్నింగ్ ఎందుకు?

By:  Tupaki Desk   |   29 March 2016 4:26 AM GMT
మాల్యా బ్యాచ్ కి మోడీ వార్నింగ్ ఎందుకు?
X
లిక్కర్ కింగ్ మాల్యా గురించి దేశం మొత్తంగా తెలీని వారంటూ ఉండని పరిస్థితి. లిక్కర్ కింగ్ గా.. విలాసపురుషుడిగా సుపరిచితుడైన విజయ్ మాల్యా.. దేశంలోని పలు బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లి పోవటం పెద్ద కలకలమే రేపింది. మీడియాలో విస్తృతంగా వార్తలు రావటంతో దేశ వ్యాప్తంగా మాల్యా గురించి పెద్దగా పరిచయం లేని కొద్దిమందికి కూడా ఫేమస్ అయిపోయారు.

మాల్యా వ్యవహారంలో ప్రధాని మోడీ పెద్దగా జోక్యం చేసుకోవటం లేదన్న విమర్శలు వచ్చినా.. ఆయన నోటి నుంచి ఎలాంటి మాటా రాలేదు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రభావమో.. మరింకేదైనా కారణమో కానీ.. మోడీ ఇన్నాళ్లకు నేరుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్ బర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన మోడీ.. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న పారిశ్రామిక పెద్దలు.. గౌరవంగా బ్యాంకులకు తిరిగి అప్పులు చెల్లించకుంటే తిప్పలు తప్పవని తేల్చి చెప్పారు.

బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే పారిశ్రామికవేత్తల్ని వదిలిపెట్టమని.. వారి నుంచి బకాయిలు వసూలు కోసం తమ ప్రభుత్వం.. ఆర్ బీఐ లు కఠిన చర్యలు తీసుకుంటాయని చెప్పిన మోడీ.. మీడియా కూడా ఈ విషయంపై దృష్టి పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మాల్యా దేశం నుంచి పరారీ అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ.. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే వారి విషయంపై ఇప్పటివరకూ పెద్దగా మాట్లాడని మోడీ.. తాజాగా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వటం.. అది కూడా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇదే తరహా వార్నింగ్ ఇచ్చిన రెండో రోజునే మోడీ స్పందించడం గమనార్హం.

మాల్యా విషయంలో మోడీ సర్కారు మిన్నకుండిపోయిందన్నటువంటి ఆరోపణలు మోడీ అండ్ కో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి భావనలు పోగొట్టటంతో పాటు.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మాల్యా ఇష్యూను విపక్షాలు రాజకీయం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తాము ముందే చెక్ చెప్పేయాలన్న ఆలోచనలోనే మోడీ నోటి వెంట తాజా వార్నింగ్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాటల్లో చూపించినంత సీరియస్ నెస్.. చర్యల విషయంలో మోడీ సర్కారు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.