Begin typing your search above and press return to search.

భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టానన్న మోడీ !

By:  Tupaki Desk   |   21 Dec 2019 3:51 PM IST
భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టానన్న మోడీ !
X
భారత్ ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక మందగమనం ఉందని అంగీకరించారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థకు మందగమనాన్ని తట్టుకొని అత్యధిక వృద్ధిరేటు సాధించే శక్తి ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధిరేటును పెంచేందుకు పారిశ్రామికవేత్తలు సాహసోపేతమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దిగజారిందని, వృద్ధిరేటు 3.5 శాతానికి దిగజారిందని, అలాంటి పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన తాను ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దానని అన్నారు.

శుక్రవారం ఆయన అసోచామ్‌ సదస్సులో మాట్లాడారు. మౌలిక సదుపాయాల మీదే కోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపారు. మరో పాతిక లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధికి ఖర్చు పెడతామన్నారు. ఈ ఖర్చుతో 2024 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. అలాగే ఆర్థిక మందగమనం మీద జరుగుతున్న చర్చ నాకు తెలుసు. దానిపై వ్యాఖ్యానాలను సవాలు చేయను. చర్చలో సానుకూల అంశాలను తీసుకుంటాను అన్నారు.

ప్రపంచబ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో భారత్‌ మూడేళ్లలోనే 142వ ర్యాంకు నుంచి 63వ ర్యాంకుకు ఎదిగిందని తెలిపారు. ఒకప్పుడు కంపెనీ పెట్టాలంటే నెలలు పట్టేదని, ఇప్పుడు గంటల్లో అయిపోతుందన్నారు. జీఎస్టీ విషయంలో పరిశ్రమలు అడిగిన మార్పులు చేస్తున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో భారత్‌ అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని పెట్టుబడుల రూపంలో సాధించిందన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్ట్‌ పల వ్యవస్థ భారత్‌ లోనే ఉందన్నారు.