Begin typing your search above and press return to search.

అరెస్టు చేస్తే రచ్చ రంబోలాయేనా ?

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:39 AM GMT
అరెస్టు చేస్తే రచ్చ రంబోలాయేనా ?
X
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. జూలై 4వ తేదీన ఆయన నరసాపురంకు రావటానికి భయపడుతున్నారో, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఒకవైపేమో తనను అరెస్టు చేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశాలివ్వాలని హోంశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై కేంద్ర హోంశాఖ మంత్రి ఇంతవరకు స్పందించలేదు. ఇదే సమయంలో తనను అరెస్టుచేస్తే రచ్చ రంబోలా అయిపోతుందని బెదిరిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు నరేంద్ర మోడీ జూలై 4వ తేదీన భీమవరంకు వస్తున్నారు. ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొనాలని తిరుగుబాటు ఎంపీకి బలమైన కోరిక ఉంది.

ఈ నేపధ్యంలోనే నియోజకవర్గంలోకి వస్తే ఏమవుతుంది ? రాకపోతే ఏమవుతుందనే ఊగిసలాటలో ఎంపికి టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. మోడీ రాకకు ముందే తాను నరసాపురంలో ల్యాండ్ అవటానికి హెలికాప్టర్ కూడా బుక్ చేసుకున్నారట. అయితే దానికి అనుమతి ఇంతవరకు రాలేదు.

ఇదే విషయాన్ని రాజు మాట్లాడుతూ ప్రధాని రాకకు ముందు 20 నిముషాల ముందు తాను వేదిక మీదకు వచ్చి ప్రధాని ప్రసంగం మొదలుపెట్టగానే అక్కడినుండి వెళ్ళిపోతానని చెప్పారు. ఒకవేళ మోడీ రాకకు ముందే తనను అరెస్టు చేస్తే రచ్చ రంబోలా అయిపోతుందట. నరసాపురంలో తిరుగుబాటు మొదలవుతుందన్నారు. మోడి సభ సజావుగా జరగదనేశారు. హెలికాప్టర్ లో కాకుండా తాను కారులో వస్తే తనను అరెస్టు చేసేస్తారని తెలుసన్నారు.

ఎంపీ నోటిదూల ఏ స్ధాయిలో ఉందంటే తనను నరసాపురం సభలో పాల్గొనకుండా జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు కూడా అడ్డుకోలేరని చాలెంజ్ చేశారు. జగన్ మీద 24 గంటలూ ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్న ఎంపీ మధ్యలో జగన్ వాళ్ళమ్మని, అమ్మ మొగుడి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి ?

ఇలాంటి నోటిదూలతోనే ఎంపీ ఇంత చేటు తెచ్చుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తన టార్గెట్ జగన్ అయినపుడు జగన్ వరకు పరిమితమవ్వాలి కదా. మొత్తానికి తనంతట తానుగానే సమస్యను బాగా పెంచుకుంటున్నట్లున్నారు. చూద్దాం ఆ రోజు ఏమవుతుందో.