Begin typing your search above and press return to search.

ఐదుగురి స‌జీవ ద‌హ‌నం ఉడ‌త‌ల వ‌ల్లా.. ఇంకా న‌యం: నారా లోకేష్ సెటైర్లు

By:  Tupaki Desk   |   30 Jun 2022 9:06 AM GMT
ఐదుగురి స‌జీవ ద‌హ‌నం ఉడ‌త‌ల వ‌ల్లా.. ఇంకా న‌యం: నారా లోకేష్ సెటైర్లు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ఆటోపై హైటెన్ష‌న్ వైర్లు తెగిప‌డి ఐదుగురు స‌జీవ ద‌హ‌న‌మైన ఘ‌ట‌న ఉడ‌త వ‌ల్ల జ‌రిగిందంటూ విద్యుత్ షాక్ అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌డంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో స్పందించారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం.. ఎలుకలు మందు తాగడం.. కుక్కలు తరిమితే భయపడి కోర్టులో మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం.. ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు.

హైటెన్ష‌న్ వైర్లు ఆటో మీద ప‌డి ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే.. కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయింది అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు.

కాగా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో దానిపై విద్యుత్ వైర్ తెగిపడింది. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా కాలిపోయింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను ట్రాక్టర్‌లో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 12 మంది వరకు ఉంటారని చెబుతున్నారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులుగా గుర్తించారు. వీరిలో.. గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రాములమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి,పెద్దకోట్లకు చెందిన కుమారి ఉన్నారు.

కాగా, ఈ ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ను ఏపీఎస్ పీడీసీఎల్ హరినాథరావు ఆదేశించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ పోల్ మీదకు ఒక ఉడత ఎక్కి వైర్ ను షార్ట్ చేయడం వల్ల అది తెగి అటుగా వెళుతున్న ఆటోపై పడిందన్నారు. ఐదుగురు ప్రాణాలు పోవడానికి కారణం ఉడత అని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్నారు.

దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్ష‌న్‌విద్యుత్ వైర్లు తెగిపోయిన ఘ‌ట‌న‌లు చాలా ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు.. హ‌ఠాన్మ‌ర‌ణం చెందుతున్నార‌ని ప్ర‌జ‌లు గుర్తు చేస్తున్నారు. దీనికి విద్యుత్ శాఖ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. విద్యుత్‌శాఖ మాత్రం ప్ర‌జ‌ల‌కు ధ‌ర‌లు పెంచ‌డంలో చూపిన శ్ర‌ద్ధ‌.. నిర్వ‌హ‌ణ‌పై ఎక్క‌డా చూప‌డం లేద‌ని అంటున్నారు. దీంతో హైటెన్ష‌న్ విద్యుత్ వైర్లు.. తెగిపోతున్న ఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. తాజాగా శ్రీస‌త్య‌సాయి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌నకు కూడా నిర్వ‌హ‌ణ లోపం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌నేది వాస్త‌వం. అయినా.. దీనిని క‌ప్పిపుచ్చుకునేందుకు.. ఉడ‌త‌పై నెట్టేశార‌ని నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.