Begin typing your search above and press return to search.

నక్వీని నో ఛాన్స్ : అయితే వెంకయ్యనాయుడు లేకుంటే ఆమె...?

By:  Tupaki Desk   |   15 July 2022 7:42 AM GMT
నక్వీని నో ఛాన్స్ : అయితే వెంకయ్యనాయుడు  లేకుంటే ఆమె...?
X
దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల సందడి పార్టీలలో మెల్లగా మొదలైంది. అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న ఆసక్తి విపక్ష శిబిరంలో ఉంది. ఆ పేరు చూసుకుని తమ వైపు నుంచి ఎవరో ప్రకటించడానికి ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. ఇక ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి సంబంధించి చూస్తే బీజేపీ మదిలో చాలా పేర్లు ఉన్నాయి. అయితే వాటి నుంచి ఒకరిని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం ఒకటి రెండు రోజులలో సమావేశమై ఎంపిక చేస్తుంది అంటున్నారు.

ఇప్పటిదాకా బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అనుకున్నారు. అయితే దానికి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోందిట. అలాగే ఆరెస్సెస్ సంఘ్ పరివార్ నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయని చెబుతున్నారు. పైగా రాష్ట్రపతి తూర్పు ప్రాంతానికి ఇచ్చారని, ఉప రాష్ట్రపతిని దక్షిణాది నుంచే ఎంపిక చేయాలన్న సూచనలు వస్తున్నాయట.

బీజేపీకి సౌత్ లో బలపడడం అవసరం. అందుకే ఈ మధ్య ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించింది. అలాగే నాలుగు రాజ్య సభ నామినేటెడ్ పదవులను కూడా సౌత్ లోని నాలుగు స్టేట్స్ నుంచి ఏరి కోరి ఎంపిక చేసింది. ఇక ఇపుడు దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవిని ఎవరికి ఇవ్వాలీ అంటే సౌత్ నుంచే అన్న మాట పార్టీలో వస్తోందిట.

ఇది వ్యూహాత్మకంగా కూడా కరెక్ట్ డెసిషన్ అవుతుంది అని అంటున్నారు. దాంతో బీజేపీలో మళ్ళీ కొత్త ఆలోచనలతో అధినాయకుల బుర్రలు వేడెక్కిపోతున్నాయట. ఉప రాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్ పర్సన్ గా కూడా ఉంటారు. పెద్దల సభను నిభాయించాలి. అధికార పార్టీకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. అలా చూసుకున్నపుడు సీనియర్ మోస్ట్ నేత, ప్రస్తుత ఉప రాష్ట్రపతి కంటే వెంకయ్యనాయుడు యోగ్యులు ఎవరు అన్న చర్చ కూడా పార్టీలో వస్తోందిట.

ఆయన సౌత్ కి చెందిన దిగ్గజ నేత. వెంకయ్యనాయుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలో కూడా సానుకూల స్పందన ఉంటుంది. దక్షిణాదిలోనే బిగ్ ఫిగర్ ఆయన. అందువల్ల మేము సౌత్ కి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన మీదట వెంకయ్యనాయుడుకే మరోసారి ఈ కీలకమైన పదవిని అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అయితే ఉంది అంటున్నారు.

ఒక వేళ ఏమైనా సమీకరణలు మారితే మాత్రం తమిళనాడుకు చెందిన నాయకురాలు, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ అయిన తమిళ్ సై కి ఈ అత్యున్నత పదవి దక్కుతుంది అని అంటున్నారు. ఆమె పట్ల బీజేపీ ఆది నుంచి ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఉంది. ఒక వైద్యురాలిగా తమిళనాట తన జీవితాన్ని మొదలెట్టి బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఎదిగిన తమిళ్ సై మేధావిగా పేరు పొందారు. ఆమె పేరు అయితే రేసులో చాలా ముందు ఉంది అంటున్నారు.

ఈ ఇద్దరు కాకపోతే మాత్రం పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, కేంద్ర మాజీ మంత్రులు సురేశ్‌ ప్రభు, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీ, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు. కానీ సౌత్ కే ఉపరాష్ట్రపతి పదవి దక్కడం ఖాయమని వార్తలు బలంగా ఉన్న వేళ అయితే వెంకయ్యనాయుడు లేకపోతే తమిళ్ సై అనే అంటున్నారు అంతా. ఈ సస్పెన్స్ కి ఒకటి రెండు రోజులలో తెర పడడం ఖాయం.