Begin typing your search above and press return to search.

‘‘ముదురు’’ మాటలేంది నన్నపనేని..?

By:  Tupaki Desk   |   16 May 2016 4:39 AM GMT
‘‘ముదురు’’ మాటలేంది నన్నపనేని..?
X
తనకు ఏ మాత్రం సంబంధం లేని ఒక సివిల్ మ్యాటర్ లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతూ విమర్శలు వస్తున్న టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి.. పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కుటుంబ సభ్యుల హింసకు గురైన ఒక మహిళకు మద్దతు తెలిపే విషయంలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు నన్నపనేని మీద వచ్చాయి. అయితే.. ఆ విమర్శల్ని లైట్ తీసుకున్న నన్నపనేని విజయవాడ పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలపై అధికారులు గుర్రుగా ఉన్నారు. విజయవాడ సిద్ధార్థ నగర్ లో వంద కోట్ల సివిల్ వ్యహారంలో నన్నపనేని తన పరిధి దాటి జోక్యం చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటున్న ఆమె.. విజయవాడ పోలీసులు ఎందులోనూ పని చేయరా? అని ప్రశ్నిస్తున్నారు. ఒకదానితో ఇంకొకటి సంబంధం లేని అంశాల్ని కలిపేసి.. విజయవాడ పోలీసులపై విమర్శలు గుప్పించటం గమనార్హం. కాల్ మనీ వ్యవహారంలోకానీ.. అయేషా హత్య కేసులో కానీ పోలీసులు పని చేయటం లేదని ఆరోపించారు.

విజయవాడ పోలీసులు ‘‘పెద్ద ముదుర్లు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మర్డర్లు.. మానభంగాలు జరుగుతున్నా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నట్లుగా ఉండిపోతారని నన్నపనేని పోలీసుల మీద ఫైర్ అయ్యారు. విధి నిర్వహణలో పోలీసులు తప్పుచేస్తే నిలదీయటం తప్పేం కాదు. కానీ.. ఒకదాంతో మరొకటి సంబంధం లేకుండా ఒక సివిల్ మ్యాటర్ లో పోలీసులు జోక్యం చేసుకోలేని అంశాన్ని పట్టుకొచ్చి ‘‘ముదుర్లు’’ అంటూ ముదురు విమర్శలు చేస్తున్న నన్నపనేనిపై పోలీసు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.