Begin typing your search above and press return to search.

నంద్యాల ఓటమి జగన్ కు లాభమేనా?

By:  Tupaki Desk   |   2 Sep 2017 2:41 PM GMT
నంద్యాల ఓటమి జగన్ కు లాభమేనా?
X
మొన్న నంద్యాల, నిన్న కాకినాడ... టీడీపీ వరుస విజయాలు టీడీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేవే. నిజానికి నిన్నటి వరకు ఏపీలో చంద్రబాబు పని అయిపోయిందంటూ ఢిల్లీలో మోదీకి నూరి పోసిన ఏపీ బీజేపీ నేతలకు ఇది ముమ్మాటికి చెంపదెబ్బే. మరి రెండు ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని దెబ్బతిన్న వైసీపీ పరిస్థితేంటి.. ? అందరూ అంటున్నట్టు... ఓ వర్గం మీడియా చెబుతున్నట్టు... జగన్లో అతి విశ్వాసం... దక్షిణాది రాజకీయాల ఏ మాత్రం అనుభవం లేని ప్రశాంత్ కిశోర్ నమ్ముకోవడం వైసీపీకి ముమ్మాటికీ దెబ్బ తీసిందా..? ఈ వరుస ఓటములతో వైసీపీ కుదేలైనట్టేనా.. ? వారం రోజులు స్వయంగా తానే మకాం వేసినా విజయం లభించకపోవడం అటు జగన్లోనూ నిరాశనే నింపిందా.. ? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.

అయితే నిజానికి టీడీపీని కొమ్ముకాసే వర్గం ఎక్కువైపోవడం.. వైసీపీ సొంత పత్రిక మాటల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో జనంలోకి అదే సిగ్నల్స్ పంపించే ప్రయత్నాలు తెగ జరుగుతున్నాయి. నిజానికి వైసీపీకి రెండు ఎన్నికలు ఎంత మేలు చేశాయంటే... ఓ రకంగా 2019 ఎన్నికలకు సిద్ధం కావడానికి ఇంతకన్నా మంచి పాఠం ఇంకొకటి ఉండదు. నిజంగా అందరూ అంటున్నట్టు లోపాలు తనలోనే ఉన్నాయా..? లేదా తన చుట్టూ ఉన్న వారిలో ఉన్నాయా.. ? ఉత్తరాది నుంచి ఎరువు తెచ్చుకున్న పీకే వ్యూహాల్లో ఉన్నాయా అన్నది బేరీజు వేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పటికీ 2019 ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి భారీ మెజార్టీ కనిపిస్తున్నప్పటికీ వైసీపీకి మరో 14 వేల ఓట్లు వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.

నిండా ఐదేళ్లు కూడా లేని పార్టీ... మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న టీడీపీని ఒకానొక దశలో షేక్ చేసిందంటే పార్టీకి జనాల్లో ఎంత ఆదరణ ఉందో తెలుస్తునే ఉంది. ఓ రకంగా టీడీపీకి ఈ గెలుపు తీసుకొచ్చిన ఆత్మ విశ్వాసం వచ్చే ఎన్నికల నాటికి అతి విశ్వాసం అయినా ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు. లోపాలు సరిదిద్దుకొని వ్యూహాత్మకంగా అడుగులేస్తే వైసీపీకి నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. ఎందుకంటే చంద్రబాబు చుట్టూ ఉన్న నేతలు ఆ పార్టీకి బలం మాత్రమే కాదు.. బలహీనత కూడా. చంద్రబాబు ఒక్కరే ఎంత పని చేసినట్టు కనిపించినా... ఆయన మంత్రి వర్గంపై జనాల్లో రోజు రోజుకీ అసంతృప్తి పెల్లుబుకుతునే ఉంది. జగన్ కు కేవలం ఫిరాయింపు నేతలపై ఆధారపడకుండా.. యువతలో ఆయన పట్ల క్రేజ్ ను ఓట్లుగా మల్చుకోవడంపై దృష్టి పెడితే మంచిది. దాంతో పాటు అదే యువతకు అవకాశాలిచ్చే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. అన్ని సార్లు డబ్బులు పెట్టే నాయకులకే ఓట్లు పడవు. ఒక్కోసారి జనం నుంచి పుట్టుకొచ్చే నేతలు కూడా ఉంటారు. అలాంటి వారి పై దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఏపీలో అయితే టీడీపీ, లేదంటే వైసీపీ తప్ప మరో పార్టీకి ఎలాగూ చోటు లేదన తేలిపోయింది. తాజాగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఉత్తరాంధ్ర నుంచి హరిబాబుకు చోటు కల్పించి అర్బన్ ఓటర్లను ఆకర్షించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా.. ఆ పార్టీ బలమెంతో నిన్నగాక మొన్న కాకినాడలోనే తేలిపోయింది. సో... నంద్యాల వల్ల వైసీపీకి జరిగింది నష్టం కాదు.. ముమ్మాటికీ లాభమే. మరి అంత పాజిటివ్ గా ఆలోచించడానికి అటు జగన్.. ఇటు పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారా అన్నదే ఇప్పుడు ప్రశ్న.