Begin typing your search above and press return to search.

నందూ కొత్త బలం బయటకొచ్చింది? అతగాడి చేతిలో అంతమంది స్వామీజీలు?

By:  Tupaki Desk   |   12 Dec 2022 8:30 AM GMT
నందూ కొత్త బలం బయటకొచ్చింది? అతగాడి చేతిలో అంతమంది స్వామీజీలు?
X
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత శక్తివంతమైన రాజకీయ నేతగా..తిమ్మిని బమ్మిని చేసే సామర్థ్యం ఉన్న అధినేతగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గులాబీ బాస్ కు చెందిన ఎమ్మెల్యేల్ని పార్టీ మార్చేసేంత సాహసం ఎవరూ చేయని పరిస్థితి. కారణం.. ఆయనకు ఒళ్లంతా కళ్లేనని జాగ్రత్త పడుతుంటారు. ఏ చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా సమాచారాన్ని సేకరించటమే కాదు.. ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదంటారు.

అలాంటి కేసీఆర్ కు షాకిచ్చే ప్రోగ్రాం చేయటం అంటే మాటలు కాదు. కానీ.. ఆ ధైర్యాన్ని ప్రదర్శించినట్లుగా ఎమ్మెల్యేల ఎర కేసు వెలుగు చూసినప్పుడు చాలామందిలో కలిగింది. ఈ కేసులోని ముగ్గురిలో నందూ మినహాయిస్తే.. మిగిలిన ఇద్దరిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి కారణం.. కథ మొత్తం నడిపింది నందూనే అని చెబుతున్నారు.

నందూ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పటికే పలు అంశాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా అతనికి సంబంధించిన కొత్త విషయం బయటకు వచ్చింది. అదేమంటే.. అతగాడి చేతిలో మొత్తం తొమ్మిది మంది స్వామీజీలు ఉన్నారని చెబుతున్నారు. వీరిలో తాజా ఎపిసోడ్ లో అరెస్టు అయిన రామచంద్ర బారతి.. సింహయాజిల్ని మినహాయిస్తే.. మరో ఎడుగురు ఉన్నారని చెబుతున్నారు. తన చేతిలో ఉన్న స్వామీజీల సాయంతో నందూ చక్రం తిప్పుతారని చెబుతున్నారు.

పేరున్న వ్యాపార, పారిశ్రామికవేత్తల్ని పరిచయటం చేసుకోవటం.. రాజకీయ నాయకులకు నమ్మకం కుదిరే స్వామీజీలను రంగంలోకి దించటం.. వారి చేత పూజలు చేయిస్తానంటూ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. స్వామీజీలతో పూజలు చేయించటాన్ని ఒక అలవాటు చేసుకున్నట్లు చెబుతారు. పూజలతో వచ్చే పరిచయాన్ని మరింత పెంచుకోవటం.. వారితో మరింత సన్నిహితంగా ఉంటూ వ్యాపార లావాదేవీల్ని నిర్వహిస్తుంటారని చెబుతుంటారు. అలా పెరిగిన పరిచయాన్ని సమయానికి తగ్గట్లుగా వ్యాపారం వైపునకు మళ్లిస్తారన్న విషయం వెలుగు చేసింది.

పూజలకు ఒప్పించటం.. స్వామీజీల గురించి గొప్పలు చెప్పటంతో పాటు.. వారిని ఎయిర్ పోర్టు నుంచి కారులో తీసుకురావటం.. స్టార్ హోటళ్లలో అతిధ్యం ఇవ్వటం.. పూజల వేళలో ప్రముఖులు ఇవ్వాల్సిన దక్షిణను వారి తరఫున నందూనే ఇచ్చేవాడని చెబుతున్నారు. అలా ఇవ్వటం ద్వారా మనసుల్ని దోచుకొని తర్వాతి కాలంలో వ్యాపారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. పూజలు.. స్వామీజీలతో ప్రముఖుల్ని పడేసే పక్కా ప్లాన్ ను నందూ విజయవంతంగా అమలు చేస్తుంటారన్న కొత్త విషయం తాజాగా బయటకు వచ్చింది. తవ్వి తీస్తే ఇలాంటి మరెన్నికళలు బయటకు వస్తాయో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.