Begin typing your search above and press return to search.

మంత్రిగారితో మహేష్ భార్య మీటింగ్

By:  Tupaki Desk   |   23 May 2016 9:45 AM GMT
మంత్రిగారితో మహేష్ భార్య మీటింగ్
X
అవును.. మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తెలంగాణ మంత్రిని కలిసింది. ఆయనతో దాదాపు గంట పాటు సమావేశమైంది. నమ్రత.. మంత్రిని ఎందుకు కలిసి ఉంటుందో మహేష్ అభిమానులు ఈజీగానే కనిపెట్టేస్తారులెండి. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామ అభివృద్ధిపై చర్చించడం కోసం నమ్రత.. సోమవారం తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసింది. జూపల్లి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి కూడా పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి తాము వేసుకున్న ప్రణాళికల గురించి నమ్రత మంత్రికి వివరించింది. ఈ కార్యక్రమాలు చేపట్టడానికి తమ వంతుగా అందించాల్సిన సహకారం అంతా అందిస్తామని నమ్రతకు మంత్రి హామీ ఇచ్చారు. సిద్ధాపూర్లో ఆరోగ్యం.. పరిశుభ్రత.. పాఠశాల అభివృద్ధిపై నమ్రత తమ ప్రణాళికల్ని వివరించినట్లు కలెక్టర్ శ్రీదేవి తెలిపారు. మంత్రితో భేటీ అనంతరం నమ్రత మాట్లాడుతూ సిద్దాపూర్ గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా మారుస్తామని చెప్పింది.

మహేష్ ఆంధ్రప్రదేశ్ లోని తన తండ్రి సొంత గ్రామం బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని సిద్ధాపూర్ ను సైతం దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బుర్రిపాలెంను సందర్శించిన మహేష్.. సిద్ధాపూర్ కు సైతం త్వరలోనే వస్తానన్నాడు. నమ్రత ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లి సర్పంచితో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించింది. త్వరలోనే మహేష్-నమ్రత కలిసి అక్కడికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముంది.