Begin typing your search above and press return to search.

వైసీపీ కి బీజేపీ హై కమాండ్ కి మధ్య మొత్తం చెడిందా ?

By:  Tupaki Desk   |   8 Jun 2022 7:30 AM GMT
వైసీపీ కి బీజేపీ హై కమాండ్ కి మధ్య మొత్తం చెడిందా ?
X
ఏపీలో వైసీపీని బీజేపీ జాతీయ నాయకులు ఎవరూ ఈ రేంజిలో విమర్శించలేదు. ఏపీ బీజేపీ నాయకులు విమర్శలు చేసినా ఇంతకాలం వైసీపీ పెద్దగా పట్టనట్లుగా ఉంది. ఎందుకంటే తమ కనెక్షన్లు అన్నీ కూడా కేంద్ర స్థాయిలో పెర్ఫెక్ట్ గా ఉన్నాయని భావించబట్టే. దానికి తగినట్లుగా జగన్ ఎపుడెల్లినా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అలాగే అమిత్ షా తో కూడా జగన్ వరస భేటీలు వేస్తున్నారు.

బీజేపీ అంటే ఆ ఇద్దరే కాబట్టి వారితోనే అన్నీ చూసుకుని ఏపీలో వైసీపీ బండిని అలా జాగ్రత్తగా నడుపుకొస్తున్నారు. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళిన జగన్ మోడీ షాలతో కలసి రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చేశారు. దాంతో బీజేపీ పెద్దలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అంతే కాదు బీజేపీ విజయం ఖాయమని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే ఏ మాత్రం స్పేర్ చేయకుండా వైసీపీని గట్టిగానే ఉతికేశారు. చెడా మడా తిట్టేశారు. ఏపీలో పాలన ఒక పాలనేనా అన్నట్లుగా ఆయన చేసిన విమర్శలతో వైసీపీ కీలక నేతలు గింజుకుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పుల రాష్ట్రమని, అభివృద్ధి ఏ మాత్రం లేదని నడ్డా రాజమండ్రీలో జరిగిన గోదావరి గర్జనలో చేసిన కామెంట్స్ తో వైసీపీ నాయకులకు తేళ్ళూ జెర్రులూ ఒంటి మీద పాకినట్లు అయిందట.

ఇక ఆయన ఏపీలో ప్రతీ ఒక్క పధకం తమదేనని, ఏపీ లో సర్కార్ నడక అంతా తమ పుణ్యమేనని చెప్పేశారు. ఇలా వైసీపీ ఆరోగ్యశ్రీ కూడా తమ పధకమే అని జేపీ నడ్డా చెప్పడం పరాకాష్ట. దాని మీద వైసీపీ నాయకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 2014లో మోడీ అధికారంలోకి వస్తే వైఎస్సార్ హయాంలోనే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలియకపోవచ్చు నడ్డా అని వైసీపీ నేతలు గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే నడ్డా ఇంత ఘాటుగా హాటుగా కోస్తా జిల్లాల నడిబొడ్డున మీటింగ్ పెట్టి మరీ వైసీపీ సర్కార్ ని చెడుగుడు ఆడేయడంతో ఆ పార్టీ వారు షాక్ తింటున్నారు. అసలు నడ్డా ఉద్దేశ్యం ఏంటి అని కూడా ఫైర్ అవుతున్నారు. గత మూడేళ్ళుగా వైసీపీ కేంద్రంలోని బీజేపీని అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తూ ఉందని గుర్తు చేస్తున్నారు.

ఇక తొందరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలకు కూడా వైసీపీ మద్దతు కీలకం అని తెలిసి మరీ నడ్డా ఇలా నోరు చేసుకోవడం అంటే మోడీకి షాకి చెప్పే మాట్లాడుతున్నారా అన్న మాట కూడా అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నదీ లేనిదీ కలిపేసి అడ్డంగా మాట్లాడుతున్న నడ్డా ఏపీలో వైసీపీ సర్కార్ మీద అక్కసునే చూపించారు అని సెటైర్లు వేశారు.

అలాగే ఏపీ అప్పుల గురించి మాత్రమే నడ్డా మాట్లాడారని, కేంద్రం 130 లక్షల కోట్ల అప్పు చేస్తే దాని సంగతి ఆయనకు అవసరం లేదా అని నిలదీశారు. మొత్తానికి నడ్డాకు ఏపీ బీజేపీ నేతలు ప్రో టీడీపీ బ్యాచ్ స్క్రిప్ట్ ఇచ్చి మరీ వైసీపీని తిట్టించారని అనుమానిస్తున్నారుట. ఇక రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ మద్దతు కావాలని తెలిసి నడ్డా ఇలా మాట్లాడితే ఇక వైసీపీ ఎందుకు మద్దతు ఇవ్వాలన్న మాట కూడా పార్టీ పెద్దలలో వస్తోందిట.

ఇక ఒక డౌట్ కూడా వైసీపీని వెంటాడుతోందిట. అమిత్ షా, మోడీ అనుమతి లేకుండా నడ్డా వైసీపీ మీద విరుచుకుపడరు కాబట్టి ఆ ఇద్దరి మాటలే నడ్డా నోట పలికించారా అన్నదే ఆ పెద్ద డౌట్ ట. మొత్తానికి నడ్డా ఏపీ టూర్ లో వైసీపీని టార్గెట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగానే ఉంది మరి.