Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ గురించి ఆజాద్ చెప్పిన ఘాటు నిజాలు!

By:  Tupaki Desk   |   29 Aug 2022 1:17 PM GMT
కాంగ్రెస్ గురించి ఆజాద్ చెప్పిన ఘాటు నిజాలు!
X
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్నిరోజుల తర్వాత కేంద్ర మాజీ మంత్రి, మైనారిటీ నాయ‌కుడు గులాం నబీ ఆజాద్ అస‌లు తాను పార్టీని ఎందుకు వ‌దులుకున్న‌దీ తాజాగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ గురించిన కొన్ని నిజాల‌ను నిర్బ‌యంగా బ‌య‌ట‌పెట్టారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు. జీ-23 నేతల్లో ఉన్న తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీలో తనను టార్గెట్ చేశారన్నారు. అయితే ఇప్పుడు తన రాజీనామాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి అత్యవసరంగా ఔషధాలు అవసరమ ని గులాం నబీ ఆజాద్ అన్నారు. అయితే పార్టీకి డాక్టర్లకు బదులుగా కాంపౌండర్లు వైద్యం అందిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయడానికి నాయకత్వానికి సమయం లేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులను ఏకం చేయకుండా, వారు పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ పునాదులు చాలా బలహీనపడ్డాయని, ఏ క్షణమైనా వ్యవస్థ మొత్తం శిథిలం కావచ్చని జోస్యం చెప్పారు.

అందుకే కొంతమంది నాయకులతో కలిసి పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కొందరు స్వార్థపరులు త‌న‌ను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, ఎవ్వరూ ప్రశ్నించకూడదని కాంగ్రెస్ అనుకున్న‌ట్టు చెప్పారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయని, కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేద‌ని చెప్పారు. అందుకే తాను విసిగిపోయి బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. తాను బీజేపీలో చేరేది లేద‌న్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నందున త్వరలో కొత్త పార్టీ పెడతానని ఆజాద్ చెప్పారు.

బీజేపీకి అనుబంధ‌మేనా?

కాగా, ఆజాద్ కొత్త‌పార్టీ పెడ‌తాన‌ని చెప్ప‌డం.. సంచ‌ల‌నంగా మారింది వాస్త‌వానికి.. బీజేపీఇ క్క‌డ పాగా వేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌శ్మీర్ పండిట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు కూడా చేసింది. క‌శ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఏకంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌మోట్ చేశారు. అయితే.. ఇక్క‌డ బీజేపీ అనుకున్న‌ట్టుగా ప‌రిణామాలు క‌నిపించ‌డం లేదు.

మ‌హ‌బూబా ముఫ్తీ, ఒమ‌ర్ అబ్దుల్లా వంటి బ‌ల‌మైన నాయ‌కులు ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆజాద్ ఇక్క‌డ పార్టీ పెట్టి ఓట్లు చీల్చ‌డ‌మే బీజేపీ లాంటి పార్టీలు కొరుకుంటున్నాయి. ఇదే జ‌రిగితే.. ఆ వొచ్చే సీట్ల‌తో బీజేపీ చేతులు క‌లిపే అవ‌కాశం ఉంటుంద‌ని.. అప్పుడు ఆజాద్ మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావ‌డం.. బీజేపీ వ్యూహం ఫ‌లించి మంచుకొండ‌ల్లో క‌మ‌ల వికాసం రెండూ జ‌రుగుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.