Begin typing your search above and press return to search.

కాల్పుల క‌థః కాల్చింది అత‌నే అంటున్న విక్ర‌మ్‌

By:  Tupaki Desk   |   29 July 2017 6:50 AM GMT
కాల్పుల క‌థః కాల్చింది అత‌నే అంటున్న విక్ర‌మ్‌
X
మాజీ మంత్రి ముఖేష్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై కొత్త చ‌ర్చ‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి పారిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాలు, కాల్పులు జరిగిన తీరును బట్టి ప్లాన్‌ప్రకారం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు చెప్పినట్టుగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారా? అప్పులు ఇచ్చినవారి ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు విక్రమ్‌ గౌడ్ తన దగ్గరి వ్యక్తులతో పథకం ప్రకారం కాల్పులు జరిపించుకున్నాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెం 86లోని ప్లాట్‌ నెంబర్ 459లో విక్రమ్‌ గౌడ్ భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు. సమీపంలోని దర్గాలో శుక్రవారం అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3.15 ప్రాంతంలో ఏర్పాట్లు చేసేందుకు వెళ్లాలని సిద్ధమయ్యామని విక్రం గౌడ్ భార్య షిఫాలీ తెలిపారు. ముందుగా స్నానంచేసి తయారైన విక్రమ్‌ గౌడ్ పై అంతస్తు నుంచి హాల్‌ లోకి వెళ్లిన రెండు నిమిషాల్లోనే కాల్పుల శబ్దం వినిపించిందని, కిందకు వచ్చి చూడగా రక్తపు మడుగులో తన భర్త కనిపించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని విక్రమ్‌గౌడ్ చెప్పారని వివరించారు. వెంటనే 108కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్‌ లో నిద్రిస్తున్న వాచ్‌ మెన్ శ్రీనివాస్ - డ్రైవర్ శ్రీకాంత్‌ ను అప్రమత్తం చేసి కారులో అపోలో దవాఖానకు తరలించామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బుల్లెట్ గాయాలతో ఉన్న విక్రమ్‌గౌడ్‌ను వైద్యులు వెంటనే ఐసీయూకి తరలించారు. కుడివైపు భుజానికి ఆరు అంగుళాల కింది నుంచి దూసుకుపోయిన బుల్లెట్ వెన్నెముకలో ఇరుక్కున్నదని వైద్యులు తెలిపారు. మరో బుల్లెట్ ఎడమభుజం కిందిభాగంలో నుంచి బయటకు వచ్చేసిందన్నారు. శరీరంలో ఇరుక్కుపోయిన బుల్లెట్‌ ను తొలగించామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఏసీపీ నోముల మురళి - ఇన్‌ స్పెక్టర్ శ్రీనివాస్‌ తో పాటు క్లూస్‌ టీం - డాగ్ స్కాడ్ ఆధారాలు సేకరించింది. వెస్ట్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో విక్రమ్‌ గౌడ్ - అతడి భార్య షిఫాలీ ఉన్నారని..కాల్పులకు 7.65 ఎంఎం పిస్టల్ ఉపయోగించారని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదుచేసినట్టు తెలిపారు.

అయితే తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో మాట్లాడిన విక్ర‌మ్ తనకు బాగా తెలిసిన వ్యక్తే తనపై కాల్పులు జరిపాడని, తాను కోలుకున్నాక పూర్తి వివరాలు చెబుతానని అన్నారు. ఇప్పటికిప్పుడు పేరు చెబితే తీవ్ర వివాదాలు - తన కుటుంబ పరువు ప్రతిష్ఠల సమస్యలు వస్తాయని, అందువల్ల తాను కోలుకున్న తరువాత అన్ని విషయాలు చెబుతానని అన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి విక్రమ్‌ కు ప్రాణాపాయం లేదని, ఆయన వెన్నెముక వద్ద ఉన్న ఓ బులెట్‌ ను బయటకు తీయాల్సి ఉందని చికిత్స చేస్తున్న డాక్టర్‌ తెలిపారు.

మ‌రోవైపు హైదరాబాద్‌ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో తనపేరు బయటకు వస్తుందన్న భయంతో విక్రమ్‌ గత పది రోజులుగా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. 10 రోజులుగా డ్రగ్స్ కేసుపై వస్తున్న వార్తలను తన మొబైల్‌ లో విక్రమ్ సేవ్ చేసుకున్నాడ‌ని స‌మాచారం.