Begin typing your search above and press return to search.

మోడీ పై భగ్గుమన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

By:  Tupaki Desk   |   13 Oct 2016 1:55 PM GMT
మోడీ పై భగ్గుమన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు
X
కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు భగ్గుమంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు.. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తేవటానికి.. దేశంలోని విభిన్న సంస్కృతుల్ని దెబ్బ తీయటానికి ప్రయత్నిస్తున్నదంటూ సీరియస్ అయ్యింది. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని లా బోర్డు మరో మాట లేకుండా తిరస్కరించింది.

మోడీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తున్నారు.. ముస్లింలందరూ దీనిపై పెద్ద సంఖ్యలో స్పందిస్తారని.. భారత్ లో ఒకే భావజాలాన్ని రుద్దలేరంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లింలలో ట్రిపుల్ తలాక్.. బహుభార్యత్వం లాంటి సంప్రదాయాల్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. రాజ్యాంగ మౌలిక లక్షణమైన లింగ సమానత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావు లేదంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ మధ్యన స్పష్టం చేసింది.

ఇస్లామిక్ చట్టమైన షరియా ప్రకారం ఒక వ్యక్తి మూడు సార్లు తలాక్ చెప్పటం ద్వారా తన భార్యకు విడాకులు ఇచ్చేయొచ్చు. అంతేకాదు.. ముస్లిం వ్యక్తి నాలుగు పెళ్లిళ్లు చేసుకునే వీలుంది. అయితే.. ఇదంతా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించటమేనంటూ ముస్లిం మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వివాదాస్పద అంశంపై కేంద్రం తొలిసారి తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటం ద్వారా దేశమంతా ఒకే చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. దీన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రిపుల్ తలాక్ ఉండాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు ఇస్లామిక్ దేశాల్లో సైతం ట్రిఫుల్ తలాక్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఇస్లామిక్ దేశాల్లో అమలు కాని ట్రిఫుల్ తలాక్ విధానాన్ని ఈ రోజుకీ భారత్ లో అమలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేయటం చూస్తుంటే.. ముస్లిం మహిళల వాదనను.. వారి ఆవేదన బోర్డుకు పట్టదా? అన్న సందేహం కలగక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/