Begin typing your search above and press return to search.

చందానగర్ ఓయో రూంలో ఆమె హత్య.. తోడు వచ్చినోడు ఒంగోలులో?

By:  Tupaki Desk   |   26 Oct 2021 2:30 PM GMT
చందానగర్ ఓయో రూంలో ఆమె హత్య.. తోడు వచ్చినోడు ఒంగోలులో?
X
హైదరాబాద్ లోని చందానగర్ లో సంచలనం చోటు చేసుకుంది. ఓయో రూంలో ఒక మహిళ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో.. ఆమెతో పాటు రూం తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోవటం.. అతగాడు ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం షాకింగ్ గా మారింది. అసలేం జరిగింది? ఓయో రూంలో ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి ఎవరు? ఆమెతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? ఇంతకూ ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల నాగ చైతన్య హైదరాబాద్ శివారులోని నల్లగండ్ల సిటిజన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటెటివ్ గా పని చేస్తున్నారు. ఉద్యోగంలో భాగంగా ఆసుపత్రికి వచ్చి వెళ్లే క్రమంలో చైతన్యతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. యువతి తల్లి చిన్నతనంలో చనిపోవటం.. సవతితల్లి ఉండటం.. వీరిద్దరి కులం వేరు కావటంతో యువకుడి తరఫు కుటుంబీకులు వీరి పెళ్లిని ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో ఈ నెల 23న ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓయో రూంలో గది తీసుకున్నారు. ఇరువురు కలిసి ఉన్నారు. తర్వాతి రోజు అంటే ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది రూంను పరిశీలించే ప్రయత్నం చేయగా.. గొంతు కోసి రక్తపు మడుగులో నాగచైతన్య పడి ఉంది. దీంతో పోలీసులకు లాడ్జి సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు ఓయో గది తీసుకున్న కోటి రెడ్డి కనిపించలేదు. చైతన్య మరణం నేపథ్యంలో కోటిరెడ్డి కోసం ఆరా తీసిన పోలీసులకు.. అతగాడు పొట్ట.. గొంతు దగ్గర కత్తిగాట్లతో ఒంగోలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు.. చైతన్య గొంతు కోసుకుందని.. అందుకే భయంతో తాను వచ్చేసినట్లుగా పేర్కొన్నాడు. లాడ్జిని పరిశీలించిన పోలీసులకు గదిలో మద్యం సీసాతో పాటు.. రక్తపు మడుగును కడగటానికి ప్రయత్నించినట్లుగా ఆధారాలు లభించాయి. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.