Begin typing your search above and press return to search.

జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ పై హత్యాయత్నం?

By:  Tupaki Desk   |   6 Sep 2019 8:28 AM GMT
జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ పై హత్యాయత్నం?
X
ఈ వార్త నిజంగానే సంచలనాలకే సంచలనమని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గతంలో కోడి కాళ్లకు కట్టే కత్తితో దాడి చేసి సంచలనం సృష్టించిన జనుపల్లి శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగిందట. జగన్ విపక్ష నేత హోదాలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనపై శ్రీనివాస్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించిన జగన్... దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. జగన్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా... శ్రీనివాస్ చేతిలోని కత్తి జగన్ మెడ వెనక భాగంలో గుచ్చుకునేదే. అదే జరిగి ఉంటే జగన్ కు ప్రాణాపాయం లేకపోలేదన్న వాదన వినిపించింది.

జగన్ పై దాడి చేసిన వెంటనే పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టులో కొనసాగుతోంది. నిందితుడు శ్రీనివాస్ మాత్రం విచారణ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఈ క్రమంలో నేడు ఎన్ ఐఏ కోర్టుకు హాజరైన శ్రీనివాస్ తరఫు న్యాయవాది సలీం... సంచలన విషయాన్ని వెల్లడించారు. జైల్లో ఉన్న శ్రీనివాస్ పై హత్యాయత్నం జరిగిందని - అది కూడా జైలర్ - వార్డన్ లే శ్రీనివాస్ పై హత్యాయత్నానికి దిగారని కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రాణహానీ ఉందని - తక్షణమే అతడిని మరో జైలుకు తరలించాల్సిందిగా సలీం ఓ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా శ్రీనివాస్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ జైలర్ - వార్డర్ పై కేసు నమోదు చేయాలని కూడా సలీం సదరు పిటిషన్ లో కోర్టును కోరారు.

విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్... నాడు పెను కలకలమే రేపారు. ఈ కేసు దర్యాప్తు ఏపీ పోలీసులకు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని జగన్ కోరారు. ఈ మేరకు ఈ కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) చేపట్టగా... ఇప్పటికే ఓ వాయిదాకు శ్రీనివాస్ హాజరయ్యారు కూడా. ఈ కేసు విషయంలో మీడియాకు లీకులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దరిమిలా... ఇటు నిందితుడి తరఫు న్యాయవాది గానీ - అటు ప్రభుత్వ తరఫు న్యాయవాది గానీ ఈ కేసు వివరాలను బయటకు వెల్లడించడం లేదు. అసలు ఈ కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో శ్రీనివాస్ పై జైలులోనే జైలు అధికారులే దాడి చేశారంటూ అతడి తరఫు న్యాయవాది ఆరోపణలు చేయడం - దీనిపై దర్యాప్తు జరపడంతో పాటుగా బాధ్యులపై కేసు నమోదు చేయాలని - శ్రీనివాస్ ను మరో జైలుకు తరలించాలని అతడి తరఫు న్యాయవాది కోర్టుకెక్కడం నిజంగానే సంచలనం రేకెత్తిస్తోంది. మరి ఈ పిటిషన్ పై కోర్టు ఏమంటుందో చూడాలి,.