Begin typing your search above and press return to search.

ప్రధాన పార్టీల్లో మునుగోడు రచ్చ

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:03 AM GMT
ప్రధాన పార్టీల్లో మునుగోడు రచ్చ
X
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్ గా మారిన మునుగోడు వ్యవహారం అన్ని పార్టీల్లో కాకను రేపుతోంది. మాజీ కాంగ్రెస్ నేత పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీకి చేరే క్రమంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవి.. పార్టీ మారిన నేపథ్యంలో అదే పదవిలో ఉండటం విలువలతో కూడిన రాజకీయంగా భావించి రాజీనామా చేశారు. పేరుకు విలువల మాట చెబుతున్నా.. పార్టీ కంటే వ్యక్తిగా తనకున్న పరపతి ఎంతన్నది నిరూపించే ప్రయత్నంగా దీన్ని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా పుణ్యమా అని ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇదిలా ఉంటే.. రాజీనామా చేసిన మునుగోడుకు మళ్లీ ఎమ్మెల్యే కావాలని రాజగోపాల్ రెడ్డి బలంగా ఆశిస్తుంటే.. అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా తమ సత్తా చాటాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తెలంగాణలో తమకు తిరుగులేదన్న విషయాన్ని తేల్చి చెప్పటంతో పాటు.. తమ గ్రాఫ్ పడిపోతుందంటూ సాగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్న విషయాన్ని చాటి చెప్పాలని భావిస్తోంది.

మరోవైపు బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. ఈ పార్టీలోచేరిన రాజగోపాల్ రెడ్డి వరకు చూస్తే.. తాను ఏ పార్టీలో ఉన్నా సరే.. మునుగోడు అంటే తాను మాత్రమే అన్న విషయాన్ని ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా స్పష్టం చేయాలని భావిస్తోంది. మరోవైపు బీజేపీ అధినాయకత్వం విషయానికి వస్తే.. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు ద్వారా తెలంగాణలో తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ గెలుపుతో తెలంగాణ అధికారపక్షానికి మించిన ఆదరణ ప్రజల్లో ఉందన్న విషయాన్ని ఫ్రూవ్ చేయాలని భావిస్తోంది.

ఈ రెండు పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. తమ పార్టీకి చెందిన నేత.. తమకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలోకి చేరిపోయిన నేపథ్యంలో..ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తమకు తిరుగు ఉండదని భావిస్తున్నారు. గెలుపు కోసం పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడు అదే పని మీద తలమునకలై ఉన్నాయి. ఇలాంటి వేళ.. ప్రధాన పార్టీలకు కొత్త సమస్య వచ్చి పడింది. మునుగోడు అభ్యర్థుల విషయంలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అధికార బీజేపీ మినహా మిగిలిన రెండు ప్రధాన పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపిక మీద రచ్చ నడుస్తోంది.

అధికార టీఆర్ఎస్ విషయానికి వస్తే..గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన కూసుకుంట్ల ప్రభాకర్ కు మరోసారి అవకాశం ఇవ్వాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అసమ్మతి భగ్గుమంటోంది. కూసుకుంట్ల అభ్యర్థిత్వం సరికాదంటూ పలువురు వ్యతిరేక గళం వినిపించటంతో.. వారితో మంత్రి జగదీశ్వర్ రెడ్డి భేటీ అయి బుజ్జగించే ప్రయత్నం చేయగా.. అవి కాస్తా ఫెయిల్ అయ్యాయి. దీంతో కేసీఆర్ వద్దకు వారిని తీసుకెళ్లగా.. ప్రగతిభవన్ లో వారికి సర్దిచెప్పి.. అందరూ కలిసి పార్టీ డిసైడ్ చేసిన వారికి మద్దతు ఇవ్వాలని చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. కూసుకుంట్లకు ఇస్తే మాత్రం తమ మద్దతు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

ఇక.. కాంగ్రెస్ లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొందని చెబుతున్నారు. అభ్యర్థి ఎంపికకు సంబంధించి రెండు సమావేశాల్ని నిర్వహించినా.. తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోతున్నారు. పల్వాయి స్రవంతి.. చెరుకు సుధాకర్ లు పోటీ పడుతుంటే.. పార్టీ ఆలోచన మరోలా ఉందంటున్నారు. దీంతో.. ఆ పార్టీలోనూ అభ్యర్థికి సంబంధించిన రచ్చ నడుస్తోంది. మొత్తంగా ప్రధాన పార్టీలకు మునుగోడు వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పక తప్పదు.