Begin typing your search above and press return to search.

మునుగోడుకు బాబులా మారిన గుజ‌రాత్.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   20 Nov 2022 12:30 AM GMT
మునుగోడుకు బాబులా మారిన గుజ‌రాత్.. ఏం జ‌రుగుతోందంటే!
X
ఇటీవ‌ల తెలంగాణ‌లోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నికలో జ‌రిగిన రాజ‌కీయ విన్యాసాలు.. తిట్లు, డ‌బ్బు పంప‌కాలు.. విమ‌ర్శ‌లు భ‌రించ‌లేక పోయారు క‌దా! ఇప్పుడు దీనికి బాబు.. అనిపించేలా గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు క‌నిపిస్తున్నాయి. నిజానికి ఎన్నికలు అంటేనే ప్రచార హోరు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పర్యటనలతో నేతలు కార్యకర్తలు తిరుగుతుంటారు. త్రిముఖ పోరు నెలకొన్న గుజరాత్‌లో పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నా యి. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అధికార బీజేపీ దూసుకెళ్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కార్యకర్తలు, వ‌లంటీర్లతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అదేస‌మ‌యంలో కీల‌క స్థానాల్లో అభ్య‌ర్థుల కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగులు కామ‌న్‌గా మారిపోయాయి.

ఫేస్‌బుక్, వాట్సాప్‌, ట్విటర్, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారపార్టీ బీజేపీ ప్రచారం చేస్తుండగా.. అవే వేదికలపై బీజేపీ సర్కార్‌ వైఫల్యాలను.. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ప్రజల వద్దకు చేరుస్తున్నాయి. ఓటర్లే లక్ష్యంగా అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, వాలంటీర్లు.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ ఫేస్‌బుక్, ట్విటర్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఆధారపడి ప్రచారం చేస్తోంది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు... వాట్సాప్‌లో తమ ప్రచారాన్ని క్షేత్రస్థాయి ఓటర్ల వరకు చేరేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.

గత 20 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను 2001 నుంచి 2014 వరకు సీఎంగా మోడీ చేసిన అభివృద్ధిని ప్రచార అస్త్రాలుగా బీజేపీ వాడుకుంటోంది. ముఖ్యంగా "గుజరాత్‌ను నేనే తయారుచేశాను" అనే సరికొత్త నినాదంతో గుజరాతీల సెంటిమెంట్‌ను కమలదళం ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం 5 రకాల ప్రచారాలను చేపట్టామని.. వచ్చే రోజుల్లో మరిన్ని ప్రారంభిస్తామని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

ప్రజలకు కొత్తదనం కోసం ప్రతీ వారం సరికొత్తగా ప్రచారం చేస్తామని నాయ‌కులు తెలిపారు. "20 ఏళ్ల నమ్మకం, 20 ఏళ్ల అభివృద్ధి" అనే నినాదంతో 6 నెలల క్రితమే ప్రచారం ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటితోపాటు ''మోడీ 20 ఏళ్ల బంగారుపాలన", "వందేభారత్‌'', ''మోడీ అంటే నమ్మకం" అనే నినాదాలతో ప్రజల్లోకి విస్తృతంగా బీజేపీ చొచ్చుకెళ్తోంది. బీజేపీకి ఫేస్‌బుక్‌లో 35 లక్షలకుపైగా ఫాలోవర్లు... ఇన్‌స్టాగ్రామ్‌లో 57.8 లక్షల మంది, ట్విటర్‌లో 15 లక్షల మంది, యూట్యూబ్‌లో 45,600 మంది ఫాలోవర్లు ఉన్నారు. బీజేపీకి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసేందుకు 20,000 కంటే ఎక్కువ మంది కార్యకర్తలు, 60,000 కంటే ఎక్కువమంది వాలంటీర్లు ఉన్నట్లు స‌మాచారం.

కాంగ్రెస్‌ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది. గతంలో తమ ప్రభుత్వం గుజరాత్‌లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తోంది. గత 27 ఏళ్లుగా గుజరాత్‌ అధికార పీఠంపై ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఫేస్‌బుక్‌లో 7 లక్షలమంది ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 64.3 లక్షలమంది, ట్విట్టర్‌లో 1,64,000 మంది, యూట్యూబ్‌లో 8,91,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అసెంబ్లీ స్థానాలు, సామాజిక వర్గాల వారీగా సోషల్‌ మీడియా పేజీలు రూపొందించి.. సమస్యలు లేవనెత్తి ప్రత్యేక వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు.

బూత్‌ స్థాయి, గ్రామస్థాయిలో 50,000 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి ఠాకూర్లు, పాటిదార్లు, ఆదివాసీలను అందులో చేర్పించి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ చేసిన పనులే తమను గెలిపిస్తాయని హస్తం శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. 12,000 మంది కార్యకర్తలు, వాలంటీర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.