Begin typing your search above and press return to search.

5 లక్షలు కట్టు ..కాంగ్రెస్ సీటు పట్టు !

By:  Tupaki Desk   |   4 Jan 2020 7:30 AM GMT
5 లక్షలు కట్టు ..కాంగ్రెస్ సీటు పట్టు !
X
అవును ! మీరు చదివింది నిజమే ..కాంగ్రెస్ ఒక్కొక్కరి చేత రూ . 5 లక్షలు డిపాజిట్ చేయిస్తుంది. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు కదా , అలాగే కాంగ్రెస్ కి ఇప్పుడు గతం గుర్తుకి వచ్చి మరోసారి అదే పునరావృతం కావడానికి ఆస్కారం అవుతుందో ఏమో అని ముందు జాగ్రత్త చర్యలకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఇది కూడా ఒక రకమైన రాజకీయ ఎత్తుగడే అని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కంటే ...గెలిచిన తరువాత ఆ అభ్యర్థి ఇంకో పార్టీ లోకి జంప్ కాకుండా కాపాడుకోవడమే ఈ రోజుల్లో చాలా కష్టంగా మారింది.

గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో, ఏడాది కిందటి అసెంబ్లీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన పరిషత్ ఎలక్షన్లలో తమ పార్టీ తరఫున గెలిచిన చాలామంది అధికార పార్టీలోకి దూకడంతో ఈసారి ఆలా జరగకూడదు అని ,తాజా మున్సిపల్ ఎలక్షన్లలో టికెట్ల కోసం వస్తున్న ఆశావహుల నుంచి అప్లికేషన్ల తో పాటు అఫిడవిట్లు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు ఇలా ఏది వీలైతే అది తీసుకోవాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా లో టికెట్ల కోసం ఇప్పటివరకు కాంగ్రెస్ ఆఫీసుకు సుమారు మూడు వేల అప్లికేషన్లురాగా.. అందులో 300 మంది అఫిడవిట్లు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొన్నిచోట్ల రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే టికెట్ ఇస్తామని అక్కడి కాంగ్రెస్ లీడర్లు చెప్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల లో కాంగ్రెస్ 19 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిపోయారు. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఉత్తమ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ..ఆ స్థానం లో కూడా టి ఆర్ ఎస్ విజయం సాధించింది. దీనితో ప్రస్తుతం అసెంబ్లీ లో కాంగ్రెస్ నేతలు ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఐదేండ్ల కింద 2014లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ల నుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ను ముమ్మరం చేస్తూ వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతి గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ సాధించి.. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. అలాగే గతేడాది జరిగిన మండల పరిషత్ ఎలక్షన్ల లో కాంగ్రెస్ నుంచి గెలిచి, అధికార పార్టీలో చేరిన ఎంపీటీసీ సభ్యులు వందల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ముందే వారి నుండి అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించారు.

కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ లీడర్లు మరో అడుగు ముందుకేసి.. మీడియేటర్ల దగ్గర డిపాజిట్లు చేయించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దగ్గర కు కొందరు వెళ్లి టికెట్లు అడగ్గా .. రూ.5 లక్షలు ముందస్తు డిపాజిట్ చేస్తేనే టికెట్ చేతిలో పెడతామని, చైర్మన్ ఎన్నిక పూర్తయ్యాక వెనక్కిస్తామని ఆయన చెప్పడంతో టికెట్ అడిగిన వారందరు నోరెళ్లబెట్టారు అని తెలుస్తుంది. ఏదేమైనా గత అనుభవాల దృష్ట్యా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారు.