Begin typing your search above and press return to search.

ఏపీ మునిసిపల్ పోలింగ్: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన !

By:  Tupaki Desk   |   10 March 2021 12:00 PM IST
ఏపీ మునిసిపల్ పోలింగ్: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సుడిగాలి పర్యటన !
X
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతోంది. వాటిల్లో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల మున్సిపాలిటీలు ఇదివరకే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 78,71,272 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే..విజయవాడ లోని వివిధ పోలింగ్ బూత్‌లలో పోలింగ్ సరళి తెలుసుకునేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎస్‌ ఈసీతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వివిధ పోలింగ్ బూత్‌లను సందర్శించారు.

బిషప్ స్కూల్ అనంతరం సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. పోలింగ్ ఏజెంట్ల గురించి ఆరా తీశారు. వారి వివరాలను తెలుసుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్ బూత్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాంప్‌లు, వీల్ చైర్‌లు ఏర్పాటు చేశామన్నారు. పర్యటనలో భాగంగా ఓటర్‌లను ఎస్‌ఈసీ స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారితో మాట్లాడారు. పోలింగ్ ఏర్పాట్లు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కోవిడ్ డెస్క్, హెల్త్ డెస్క్‌లను ఎస్‌ఈసీ పరిశీలించారు. వీల్ చైర్‌లో వచ్చిన వృద్ధురాలిని చూసి కార్ దిగి వచ్చిన ఎస్‌ఈసీ... 75 సంవత్సరాల అంకాశాల సుబ్బమ్మ ఓటు హక్కును వేయడానికి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శ్రమకోర్చి ఓటింగ్‌కు వచ్చిన సుబ్బమ్మను నిమ్మగడ్డ అభినందించారు.