Begin typing your search above and press return to search.

కోర్టు క‌న్నెర్రః ప్రజల సొమ్ముతో నేతలకు భద్రతా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 6:05 AM GMT
కోర్టు క‌న్నెర్రః ప్రజల సొమ్ముతో నేతలకు భద్రతా?
X
పాల‌కుల తీరుపై న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పన్నుల రూపంలో ప్రజల నుంచి రాబడుతున్న సొమ్ముతో రాజకీయ నాయకులకు పోలీసు భద్రత కల్పించడం అవసరమా ? అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ సదరు నాయకులు తమకు సెక్యూరిటీ అవసరమనుకుంటే వారి పార్టీకి చెందిన నిధులను వెచ్చించాలని అభిప్రాయపడింది. రాష్ట్రంలో పోలీసు భద్రత పొందుతున్న రాజకీయ నాయకులు - సినీ నటులు - ప్రయివేటు వ్యక్తుల నుంచి బకాయిలను రాబట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పోలీసు సెక్యూరిటీ పొందుతున్నప్పటికీ వారు.. ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడం లేదని తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ మంజులా చెల్లూర్‌ - న్యాయమూర్తి ఎంఎస్‌ సోనక్‌ ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి తాజా వ్యాఖ్యలు చేసింది.

భద్రత పొందుతున్న వీఐపీల జాబితాను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని తొలగిపోతే వారికి వెంటనే సెక్యూరిటీని తొలగించాలని వెల్లడించింది. అంతేకాక, రాజకీయ నాయకులు - ప్రయివేటు వ్యక్తులకు భద్రతగా పంపిస్తున్న పోలీసులను దీర్ఘకాలం పాటు అదే డ్యూటీలో కొనసాగించడం సరికాదని తెలిపింది. సెక్యూరిటీ గార్డుగా నియమించిన ఆరు నెలల తర్వాత తిరిగి వారిని పోలీసు శాఖలోకి తీసుకోనెలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక, నేర చరిత్ర ఉన్న వారికి సెక్యూరిటీ కల్పించొద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాది అభినందన్‌ వాగ్యానీ చేసిన ప్రతిపాదనను ధర్మాసనం తప్పుబట్టింది. నేర రికార్డు ఉన్నంత మాత్రాన వారికి స్చేచ్ఛగా బతికే హక్కు లేదని భావిస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై జరిగే తదుపరి విచారణకు హాజరు కావాలని అడ్వకేట్‌ జనరల్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.