Begin typing your search above and press return to search.

బాబు ను తిడితే మన మీద మనం ఉమ్మేసుకున్నట్టే

By:  Tupaki Desk   |   27 Nov 2019 7:27 AM GMT
బాబు ను తిడితే మన మీద మనం ఉమ్మేసుకున్నట్టే
X
ఒకప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చక్రం తిప్పారు. ఎంతో మంది నాయకులను తయారు చేశారు.. చాలా మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో ఉన్న మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, కొడాలి నాని లాంటి చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే తెలంగాణ ఉద్యమం.. తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ ఎంతో మంది ప్రజాదరణ పొందిన నాయకులను కోల్పోయింది. కానీ ఇప్పుడు అలాంటి నేతలు చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు తయారు చేసిన నాయకులే ఆయనను చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే ఇప్పటికీ తమకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబుకు విధేయత చాటుతోంది ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.

తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె వెనుకాల చంద్రబాబు ఫొటో గోడ పై ఉండడం అందరి దృష్టిని అటు వైపు మళ్లించింది.. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇలా చంద్రబాబు ఫొటో పెట్టడం ఏంటని సదురు జర్నలిస్టు సీతక్కను వివరణ కోరగా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. చంద్రబాబు తనకు రాజకీయ జన్మనిచ్చారని.. మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తులను మరిచి పోకూడదని సీతక్క అన్నారు. ‘ఇప్పటికీ నేను చంద్రబాబు ను అన్నయ్యలాగానే చూస్తానని.. ప్రతీ సంవత్సరం రాఖీని కడుతానని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన అనుబంధం చెక్కుచెదరకుండా ఉంది’ అని సీతక్క తెలిపారు.

సీతక్క చంద్రబాబుపై హాట్ కామెంట్ చేశారు. చంద్రబాబును విమర్శిస్తే.. మనమీద మనమే ఉమ్మివేయడం లాంటిదని.. చంద్రబాబు ఆధ్వర్యంలో చాలా మంది నేతలు ఎదిగారని.. వారు టీడీపీ ని విడిచిన పెట్టిన తర్వాత తమ మూలాలను మరిచిపోయారని సీతక్క పేర్కొంది.

చంద్రబాబు కింద ఎదిగిన కేసీఆర్, కడియం శ్రీహరి లు ఇప్పుడు బాబునే తిడుతున్నారని.. చరిత్ర ను ఎవరూ చెరిపి వేయలేరని.. చంద్రబాబు వీరిద్దరికి ఎన్నో అవకాశాలు ఇవ్వబట్టే ఇప్పుడు ఇంతలా ఎదిగారని సీతక్క తెలిపారు. కేసీఆర్, కడియం తీరు మంచిదికాదని ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబు పార్టీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా కొత్త నాయకులను సిద్ధం చేస్తున్నాడని తెలిపారు.