Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్ సీఎంకు బీజేపీ షాకిచ్చింది

By:  Tupaki Desk   |   3 Nov 2017 1:53 PM GMT
ఫైర్ బ్రాండ్ సీఎంకు బీజేపీ షాకిచ్చింది
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక‌ల్లో వేగం పెంచుతోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో గెలుపు కోసం క‌స‌ర‌త్తు చేస్తున్న బీజేపీ మ‌రిన్ని రాష్ర్టాలపై క‌న్నేసింది. ఇందులో ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షాల‌ రాష్ర్టాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక‌చ్చింది. దీదీకి కుడిభుజంగా వ్యవహరించే ముకుల్‌ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన ఎంపీ పదవికి గతంలోనే రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. సీఎం మమతాబెనర్జీ తాను ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమైన కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు కారణంగా చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత ముకుల్ రాయ్ బీజేపీలో చేరారు. ముకుల్ రాయ్‌ ను బీజేపీ నేత - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఢిల్లీలో గల బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముకుల్ రాయ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ముకుల్ రాయ్ అనుభవం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి ముఖుల్‌ రాయ్‌ ను పార్టీ అధిష్టానం ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేసింది. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్న ఆయన నేడు బీజేపీ పార్టీలో చేరారు.