Begin typing your search above and press return to search.

జగన్ కి ముద్రగడ మరో లేఖ... సబ్జెక్ట్ ఏంటంటే..

By:  Tupaki Desk   |   4 Nov 2019 12:00 PM GMT
జగన్ కి ముద్రగడ మరో లేఖ... సబ్జెక్ట్ ఏంటంటే..
X
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఘాటుగా స్పందించారు. ఏపీలో నెల‌కొన్న ఇసుక కొర‌త‌పై ఇప్ప‌టికే జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ పార్టీలు ఆందోళ‌న బాట ప‌డుతున్న క్రమంలో ఇప్పుడు వారికి తోడుగా కాపునేత ముద్ర‌గ‌డ జ‌త క‌లిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని నిల‌దీస్తూ కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం. దీనికి ప్రభుత్వం అడ్డం పడరాదు. ఇసుక అందించలేనపుడు రాష్ట్రం దాటకుండా నిఘా పెట్టి రాష్ట్రం లోపల ఇసుక‌ ఎక్కడ దొరికితే అక్కడ ప్ర‌జ‌లంద‌రూ ఉచితంగా తీసుకునేలా వెంటనే ఆదేశాలు ఇవ్వండి అంటూ లేఖ‌లో సూచ‌న చేశారు.

ఏపీ ప్రజలు సుఖంగా బతికేలా పాలన ఉండాలి కానీ, ఇసుక కొరత లాంటి కారణాలతో ప్రజలు ఆత్మహత్యలకు దారితీయడం దారుణమంటూ ఆ లేఖ‌లో విమ‌ర్శించారు. సమాజంలో మేధావి నుండి సామాన్యుడి వరకూ ఇసుక పాలసీపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి జ‌గ‌న్ ఆప‌సోపాలు ప‌డుతున్నార‌ని, హామీల అమ‌లుకు ప్ర‌భుత్వ‌ భూములు అమ్మబోతున్నారన్న వార్తలు వింటున్నామ‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఎన్నిక‌ల హామీల అమ‌లుకే నిధులు లేక ఇబ్బందులు ప‌డుతున్న జ‌గ‌న్, ఎన్నికల సమయంలో చెప్పని ఎన్నో పథకాలు కొత్తగా పెట్టాలని చూస్తున్నారని అందులో వివ‌రించారు.

హ‌మీల అమలుకు తేదీలు ప్రకటిస్తున్నారు కానీ అందులో మా కాపుల రిజర్యేషన్ అంశం లేకపోవడం మా కాపులు చేసుకున్న పాపంగా భావిస్తున్నామంటూ ఆ లేఖ‌లో వాపోయారు. మీరు పరిపాలన చేస్తున్న తీరుతో మీరే తీవ్ర అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోంద‌ని జగన్‌కు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. అయితే కాపు ఉద్యమనేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్‌కు రాసిన లేఖ ఇప్పుడు ఏపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ లేఖ‌పై జ‌గ‌న్ స‌ర్కారు, వైసీపీ నాయ‌కుల స్పంద‌న ఎలా ? ఉంటుందో వేచి చూడాల్సిందే.